Telugu Global
National

పుంజుకున్న కాంగ్రెస్, అయినా బీజేపీ దే హవా....సీ ఓటర్ సర్వే

ఈరోజే లోక్‌సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 284 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.కాగా, కాంగ్రెస్ 191 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేల్చింది.

పుంజుకున్న కాంగ్రెస్, అయినా బీజేపీ దే హవా....సీ ఓటర్ సర్వే
X

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ఏన్ డి ఏ కూటమే విజయం సాధిస్తుందని, అయితే కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ కూటమి గతంలో కన్నా బాగా పుంజుంటుందని ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది.

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్నందున దేశంలోని ఓటర్ల అభిప్రాయాలను అంచనా వేయడానికి C-ఓటర్‌తో కలిసి ఇండియా టుడే ఈ సర్వేను ఈ నెలలోనే నిర్వహించింది. ఈ సర్వే కోసం మొత్తం 1,40,917 మంది అభిప్రాయాలు సేకరించారు.

ఈరోజే లోక్‌సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 284 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.కాగా, కాంగ్రెస్ 191 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేల్చింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ప్రధాని పనితీరుపై 72 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది.

ద్రవ్యోల్బణం, కోవిడ్ -19 మహమ్మారి, గత మూడేళ్లుగా చైనా నుండి వచ్చిన బెదిరింపులు ఉన్నప్పటికీ, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు.

67 శాతం మంది ప్రజలు ఎన్ డీ ఏ ప్రభుత్వ‌ పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ఆగస్టు 2022 లో చేసిన సర్వేలో వ్యక్తమైన సంఖ్య కన్నా ఇప్పుడు 11 శాతం పెరిగింది.

ఆగస్ట్ 2022లో జరిపిన సర్వేలో 37 శాతం మంది ఎన్డీఏ ప్రభుత్వంపై అసంత్రుప్తిగా ఉంటే, ఇప్పుడది 18 శాతానికి తగ్గిపోయింది.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడమే NDA సాధించిన‌ అతిపెద్ద విజయమని 20 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే 14 శాతం మంది మాత్రం ఆర్టికల్ 370 రద్దు అతిపెద్ద విజయమని చెప్పారు. రామమందిర నిర్మాణం ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద విజయమని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఎన్‌డిఎ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఏమిటని అడిగిన ప్రశ్నకు, 25 శాతం మంది ధరల పెరుగుదల అని చెప్పారు. అయితే 17 శాతం మంది నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో వైఫల్యమే ఎన్డీఏ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యమని అభిప్రాయపడ్డారు.కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోలేక‌పోవడం ఎన్‌డిఎ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 8 శాతం మంది చెప్పారు.

అదే సమయంలో రాహుల్‌ చేపట్టిన జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఓట్లు రావని సర్వేలో పాల్గొన్న పౌరులు అభిప్రాయపడినట్లు పేర్కొంది. జోడో యాత్రతో ఓట్లు పడతాయా? అనే ప్రశ్నకు 37 శాతం మంది లేదని చెప్పారు.

First Published:  27 Jan 2023 4:53 AM GMT
Next Story