Telugu Global
National

రాహుల్‌, ప్రియాంకల పోటీ అక్కడి నుంచే.. క్లారిటీ వచ్చేసింది.!

అనారోగ్య కారణాలు, వయస్సుపైబడడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని.. రాజస్థాన్‌ నుంచి పెద్దల సభకు వెళ్లారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

రాహుల్‌, ప్రియాంకల పోటీ అక్కడి నుంచే.. క్లారిటీ వచ్చేసింది.!
X

సార్వత్రిక ఎన్నికల సమరం కోసం రెడీ అవుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇందులో భాగంగా ఇవాళ జరిగే CEC మీటింగ్ అనంతరం ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇక రాహుల్‌, ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు సైతం కాంగ్రెస్ హైకమాండ్ తెరదించనుంది.

అనారోగ్య కారణాలు, వయస్సుపైబడడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని.. రాజస్థాన్‌ నుంచి పెద్దల సభకు వెళ్లారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు. రాయ్‌బరేలీ నుంచి గతంలో ఫిరోజ్‌గాంధీ, ఇందిరాగాంధీ పోటీ చేశారు. 2004 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తూ వస్తున్నారు. యూపీలో 80 పార్లమెంట్ స్థానాలుండగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క రాయ్‌బరేలిలో మాత్రమే విజయం సాధించింది.

ఇక రాహుల్‌ గాంధీ పోటీపైనా అనేక వార్తలు వచ్చాయి. తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రాహుల్‌ మరోసారి తన సొంత స్థానం అమేథి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్‌. కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ సారి కూడా అమేథితో పాటు వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ చేస్తారని తెలుస్తోంది.

First Published:  7 March 2024 5:02 AM GMT
Next Story