Telugu Global
National

ప్రియాంక గాంధీ ఆధ్వ‌ర్యంలో హిమాచ‌ల్ ఎన్నిక‌లు ఎదుర్కోనున్న కాంగ్రెస్

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆద్వర్యంలో హిమాచల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్దమవుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వ‌హిస్తున్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్య‌త‌ను ప్రియాంక గాంధీ భుజాన వేసుకున్నారు.

ప్రియాంక గాంధీ ఆధ్వ‌ర్యంలో హిమాచ‌ల్ ఎన్నిక‌లు ఎదుర్కోనున్న కాంగ్రెస్
X

హిమాచ‌ల్ కోట‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా కృషి చేస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 10న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వ‌హిస్తున్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్య‌త‌ను ప్రియాంక గాంధీ భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్ కొండ ప్రాంతంలో తిరిగి రావాలని చూస్తోంది. సీనియ‌ర్ నేత వీరభద్ర సింగ్ లేకుండా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఇది మొదటి సారి. అయితే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆయన భార్య ప్రతిభా సింగ్‌ను నియమించారు. ఆమె మూడు ద‌ఫాలు ఎంపీగా ప‌నిచేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. 1985 నుండి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ధోరణి కొన‌సాగుతుండ‌డంతో ఈ సారి ఎలాగైనా త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌నే సెంటిమెంటును బ‌లంగా విశ్వ‌సిస్తోంది. కానీ అనుభవజ్ఞులు బిజెపిలోకి జంప్ చేయడం, ఉన్న‌వారిని స‌మ‌న్వ‌య‌ప‌ర్చుకోలేక‌పోవ‌డంతో పార్టీ రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత హ‌ర్ష మ‌హాజ‌న్ తాజాగా పార్టీని వీడిపోవ‌డం పెద్ద దెబ్బ‌. మ‌హాజ‌న్ , వీరభద్ర సింగ్ ఆధ్వర్యంలో అట్టడుగు స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయడంలో దశాబ్దానికి పైగా కీలక పాత్ర పోషించారు. ఆయ‌న పార్టీకి ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉండేవారు. మూడుసార్లు శాసనసభ్యుడు గా ఎన్నిక‌య్యారు. అటువంటి వ్య‌క్తి పార్టీకి దూరం కావడం కొంత‌మేర‌కు న‌ష్టం క‌లిగించే అంశ‌మ‌ని భావిస్తున్నారు. హర్ష్ మహాజన్, గులాం నబీ ఆజాద్‌కు సన్నిహితుడు, తొమ్మిదేళ్లు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పటివరకు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా, పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

మహాజన్ కంటే ముందు, ఫిరాయించిన ఇతర ప్రముఖుల‌లో ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన రామ్ లాల్ ఠాకూర్, ఇద్దరు సిట్టింగ్ శాసనసభ్యులు.. లఖ్వీందర్ రాణా,వన్ కాజల్ ఉన్నారు. వీరభద్ర సింగ్ భార్య, ప్రతిభా సింగ్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఏప్రిల్ లో నియమితులయిన‌ప్పు డు మహాజన్ ,కాజల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు, వీరితో పాటు మరో ఇద్దరు, రాజిందర్ రాణా వినయ్ కుమార్ కూడా క‌మిటీలో స్థానం పొందారు. అయ‌నా వీరు క‌మిటీ ప‌ని తీరు అసంతృప్తిగా ఉందంటూ పార్టీ వీడ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం తాండ‌విస్తున్నాయ‌ని , ప్రభుత్వ పనితీరు నిస్స‌హాయంగా ఉంద‌ని ఏఐసీసీ అధికార ప్రతినిధి అల్కా లాంబా విమ‌ర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ప్రధాన అంశాలుగా ఉంటాయని ఆమె అన్నారు.

First Published:  6 Oct 2022 9:52 AM GMT
Next Story