Telugu Global
National

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం శరద్‌ పవార్‌

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పవార్‌, కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోందని, అయినప్పటికీ బీజేపీ విజయం సాధించలేదన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం శరద్‌ పవార్‌
X

కర్నాటక‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ ఓటమి, కాంగ్రెస్ గెలుపు ఖాయమని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్ ధీమా వ్యక్తం చేశారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన, కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోందని, అయినప్పటికీ బీజేపీ విజయం సాధించలేదన్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికలను కూడా జాతీయ ఎన్నికల లాగానే చూస్తున్నదని , అయితే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్‌ స్ట్రాటజీ ఉంటుందన్నారు పవార్. కర్నాటక సరిహద్దును పంచుకుంటున్న మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని అందువల్ల అక్కడ కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలున్నాయని పవార్ తెలిపారు.

అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు గెలిచాయని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఐనప్పటికీ.. రాజస్థాన్‌, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయన్నారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసికట్టుగా బీజేపీని ఎదిరించకపోతే బీజేపీని ఓడించలేమన్నారు పవార్. ఇప్పటికైనా విపక్షాలన్నీ ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

First Published:  8 April 2023 12:09 PM GMT
Next Story