Telugu Global
National

బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మ‌ళ్లీ ఖాళీ.. - ఉన్న ఒక్క ఎమ్మెల్యే టీఎంసీలో చేరిక‌

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయ‌న తృణమూల్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిశ్వాస్.. తన విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని చెప్పారు.

బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మ‌ళ్లీ ఖాళీ.. - ఉన్న ఒక్క ఎమ్మెల్యే టీఎంసీలో చేరిక‌
X

ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ ఖాళీ అయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి బెంగాల్‌లో ఒక్క సీటు కూడా రాక‌పోవ‌డం తెలిసిందే. అయితే మూడు నెల‌ల క్రితం సాగ‌ర్ఘీ అనే నియోజ‌క‌వర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచి మ‌ళ్లీ ఖాతా తెరిచింది. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న‌ది ఒకే ఒక్క ఎమ్మెల్యే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే బేరాన్ బిశ్వాస్‌. ఇప్పుడు ఆయ‌న కూడా తృణ‌మూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ మ‌ళ్లీ ఖాళీ అయిన‌ట్ట‌యింది.

తాజాగా సాగర్ఘీ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయ‌న తృణమూల్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిశ్వాస్.. తన విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని చెప్పారు.

తృణమూల్ కీలక నేత అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్నామ‌ని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్‌ను వ్య‌తిరేకిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను మాత్రం ఆయ‌న ఖండించారు. తమ పార్టీ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు.

First Published:  30 May 2023 1:16 AM GMT
Next Story