Telugu Global
National

'ఇండియా'ను గెలిపిస్తే పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర

దేశ ఆర్థికాభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అన్నారు. అన్నదాతల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

ఇండియాను గెలిపిస్తే పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర
X

పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావాలంటూ రైతులు మ‌రోసారి ఢిల్లీపై దండెత్తుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిని గెలిపిస్తే రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర‌నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు హ‌స్తిన‌కు చేరుకుంటున్న వేళ కాంగ్రెస్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఉద్య‌మానికి రాజ‌కీయ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డ‌మేన‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అన్న‌దాత‌ల సంక్షేమ‌మే మా ధ్యేయం: ఖ‌ర్గే

దేశ ఆర్థికాభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అన్నారు. అన్నదాతల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా రైతుల పంట‌ల‌కు మ‌ద్ద‌తు చెల్లిస్తామ‌న్నారు.

15 కోట్ల రైతు కుటుంబాల‌కు మేలు: రాహుల్ గాంధీ

రైతన్నలకు ఈరోజు చారిత్రక దినమని రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ప్ర‌క‌టించారు. స్వాభిమాన్ కమిషన్ ప్రకారం ప్రతి రైతుకి కనీస మద్దతు ధరపై చట్టబద్ధ‌మైన గ్యారంటీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింద‌ని చెప్పారు. దీని ద్వారా 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని, కాంగ్రెస్ న్యాయ్ (జస్టిస్) మార్గంలో ఇది తొలి గ్యారంటీ అని రాహుల్ వెల్ల‌డించారు.

First Published:  13 Feb 2024 2:13 PM GMT
Next Story