Telugu Global
National

నడ్డా రిమోట్ ఎవరి చేతిలో పెట్టారు మోదీజీ..!

నా రిమోట్ కంట్రోల్ సంగతి సరే, మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి మోదీజీ అంటూ ప్రశ్నించారు ఖర్గే. మాట్లాడాలంటే బీజేపీకి కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయని, కానీ తాము అంత దిగజారి మాట్లాడబోమన్నారు.

నడ్డా రిమోట్ ఎవరి చేతిలో పెట్టారు మోదీజీ..!
X

మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టిన తర్వాత బీజేపీ ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతోంది. పరోక్షంగా ఆయనను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. నేరుగా ప్రధాని మోదీ కూడా ఖర్గేపై సింపతీ చూపిస్తూ సెటైర్లు వేశారు. ఖర్గేకి కాంగ్రెస్ పదవి ఇచ్చినా, రిమోట్ కంట్రోల్ మాత్రం వేరే దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. దీనికి ఖర్గే కూడా ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత తొలిసారి కర్నాటక వచ్చిన ఆయన మోదీపై నిప్పులు చెరిగారు.

నా రిమోట్ కంట్రోల్ సంగతి సరే, మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి మోదీజీ అంటూ ప్రశ్నించారు ఖర్గే. మాట్లాడాలంటే బీజేపీకి కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయని, కానీ తాము అంత దిగజారి మాట్లాడబోమన్నారు. పక్క పార్టీ అధ్యక్షుడి గురించి ఇలాంటి కామెంట్లు చేయడం బీజేపీకి సరికాదన్నారు ఖర్గే.

ఆధారాలున్నవాటిపై చర్యలు తీసుకోండి..

ఇటీవల రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు వచ్చి హడావిడి చేసిన వ్యవహారంపై కూడా ఖర్గే ఘాటుగా స్పందించారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన కామెంట్లకు ఢిల్లీ పోలీసులు పెడర్థాలు తీశారు. ఎవరిపై అఘాయిత్యాలు జరిగాయో చెబితే విచారణ చేపడతామన్నారు. ఆధారాలివ్వాలంటూ ఆయన ఇంటి వద్ద కాపుకాశారు. మరి కర్నాటకలో ఆధారాలున్న కేసుల్ని ఎందుకు తొక్కిపెట్టారని విమర్శించారు ఖర్గే. 40శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ కర్నాటకలో కాంట్రాక్టర్లు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించలేదన్నారు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలకు ఎందుకు వెంటనే బెయిలిచ్చారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఏం చేసినా ఎవరికీ కనపడదు అనుకుంటారని, ఆరోపణలు చేసేవారిపై, బాధితులపై మాత్రం కక్ష సాధిస్తారని విమర్శించారు ఖర్గే.

First Published:  21 March 2023 11:18 AM GMT
Next Story