Telugu Global
National

జీ-20 విందు.. ఖ‌ర్గేకు అంద‌ని ఆహ్వానం

ఈ విందుకు ఆహ్వానితుల జాబితాలో కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.

జీ-20 విందు.. ఖ‌ర్గేకు అంద‌ని ఆహ్వానం
X

ఢిల్లీలో నిర్వ‌హిస్తున్న జీ-20 స‌ద‌స్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్త‌య్యాయి. ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా అతిథుల‌తో పాటు మాజీ ప్ర‌ధానుల‌ను జీ-20 విందుకు ఆహ్వానించారు. వందేళ్ల‌కు పైగా సీనియారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు మాత్రం ఈ విందుకు సంబంధించిన‌ ఆహ్వానం అంద‌లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న కార్యాల‌యం ధ్రువీక‌రించింది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శ‌నివారం ఈ విందు ఇవ్వ‌నున్నారు.

ఈ విందుకు ఆహ్వానితుల జాబితాలో కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌కు మాత్రం ఆహ్వానం అందించ‌లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ హోదా క‌లిగిన‌.. రాజ్య‌స‌భలో ప్ర‌తిప‌క్ష నేత అయిన ఖ‌ర్గేకు ఆహ్వానం అంద‌లేదు.

ఈ విందుకు తాను హాజ‌రుకావ‌డం లేద‌ని దేవెగౌడ ట్వీట్ చేశారు. ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల తాను హాజ‌రుకాలేక‌పోతున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. జీ-20 సమావేశాలు విజ‌య‌వంతం కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఇక‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్.. తాము ఈ విందుకు హాజరవుతున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో గ‌ల‌ భారత మండపంలో ఈ విందు జ‌ర‌గ‌నుండ‌గా, ఈ సంద‌ర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

*

First Published:  8 Sep 2023 6:30 AM GMT
Next Story