Telugu Global
National

బీజేపీ నేతలు రావణుడిని పూజించాలి..

తాజాగా రావణ పూజ అనే విషయం కూడా కలకలం రేపింది. అయితే ఆయన తగ్గేదే లేదంటున్నారు. దేశంలో రావణ రాజ్యం నడుస్తోంది కాబట్టే, తాను రావణ పూజ అనే అంశాన్ని తెరపైకి తెచ్చానంటున్నారు అధీర్ రంజన్ చౌదరి.

బీజేపీ నేతలు రావణుడిని పూజించాలి..
X

దేశంలో రామరాజ్యం లేదని, రావణాసురుడి పాలన కొనసాగుతోందని, అందుకే బీజేపీ నేతలు రావణుడిని పూజించాలంటూ సెటైర్లు వేశారు కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. ఇటీవల రాష్ట్రపత్ని అంటూ పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. తాజాగా రావణ పూజ అనే విషయం కూడా కలకలం రేపింది. అయితే ఆయన తగ్గేదే లేదంటున్నారు. దేశంలో రావణ రాజ్యం నడుస్తోంది కాబట్టే, తాను రావణ పూజ అనే అంశాన్ని తెరపైకి తెచ్చానంటున్నారు అధీర్ రంజన్ చౌదరి. రావణాసురుడి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ఇప్పుడు భారత్ లో కూడా మోదీ పాలనలో అలానే కష్టపడుతున్నారని దెప్పిపొడిచారు.

హిట్లర్, రావణాసురుడు..

మొన్న కాంగ్రెస్ పార్టీ నిరసనల్లో భాగంగా రాహుల్ గాంధీ, మోదీని హిట్లర్ తో పోల్చారు. నిరంకుశ పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ లాగా వ్యవస్థలన్నింటినీ గుప్పెట పెట్టుకున్నారని, అందుకే ఎన్నికల్లో వారికి విజయాలు సాధ్యమవుతున్నాయని అన్నారు. తాజాగా అధీర్ రంజన్ చౌదరి.. మోదీని రావణాసురుడితో పోల్చారు.

నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు నల్ల చొక్కాలు వేసుకోవడాన్ని కూడా బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయోధ్య రామ మందిర దివస్ రోజునే కాంగ్రెస్ నేతలు నల్లచొక్కాలు వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ కూడా రాముడి చుట్టూ రాజకీయం నడపాలనుకున్నారు. దీంతో అధీర్ రంజన్ చౌదరి రావణుడి ప్రస్తావన తెచ్చారు. రాముడి చుట్టూ రాజకీయం నడపాలనుకుంటున్న బీజేపీ నేతలకు, ఇది రావణ రాజ్యం అంటూ షాకిచ్చారు. మీరు చేయాల్సింది రాముడి పూజ కాదు, రావణ పూజ అంటూ కౌంటర్లు వేశారు. మోదీ రాముడు కాదు, రావణుడంటూ పరోక్షంగా దుయ్యబట్టారు.

First Published:  7 Aug 2022 2:31 AM GMT
Next Story