ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అరగంటకే త్రిపురలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పలువురికి గాయాలు
త్రిపురలోని మజ్లిష్పూర్ నియోజకవర్గంలోని రాణిర్బజార్ మోహన్పూర్లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ అజయ్ కుమార్ తో సహా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు.
![ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అరగంటకే త్రిపురలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పలువురికి గాయాలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అరగంటకే త్రిపురలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పలువురికి గాయాలు](https://www.teluguglobal.com/h-upload/2023/01/18/719797-tripura.webp)
కేంద్ర ఎన్నికల సంఘం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అరగంటకే త్రిపురలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
త్రిపురలోని మజ్లిష్పూర్ నియోజకవర్గంలోని రాణిర్బజార్ మోహన్పూర్లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ అజయ్ కుమార్ తో సహా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు.
గాయపడిన పలువురు పార్టీ కార్యకర్తలు ఇంకా రాణిర్బజార్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించలేదన్నారు.
ఈ రోజుకాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి ఓ మంత్రి నాయకత్వం వహించారని, కొంత కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై వరస దాడులు చేస్తున్నారని, ఈ రోజు దాడులు జరిగిన మజ్లిష్పూర్ నియోజకవర్గంతో సహా ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని సుదీప్ రాయ్ డిమాండ్ చేశారు.