Telugu Global
National

బెంగళూరు వచ్చేయండి.. అభ్యర్థులకు కాంగ్రెస్ ఆదేశాలు

కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దాదాపు 130 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే బెంగళూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

బెంగళూరు వచ్చేయండి.. అభ్యర్థులకు కాంగ్రెస్ ఆదేశాలు
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతీ రౌండ్‌లో ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటలో అధికారం దక్కించుకోవాలంటే 113 ఎమ్మెల్యేలు తప్పని సరిగా ఉండాలి. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో సెంచరీ దాటేసింది. అయితే మ్యాజిక్ ఫిగర్ అయిన 113కి కాంగ్రెస్ పార్టీ స్థానాలు అటు ఇటుగా మారుతున్నాయి. మొదట్లో కాస్త వెనుకబడినట్లు కనపడిన జేడీఎస్ ఇప్పుడు కోస్తా కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలో దూసుకొని పోతోంది.

కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దాదాపు 130 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే బెంగళూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే, గత ఎన్నికల కౌంటింగ్ సమయంలో.. మొదట మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ చివరకు అంతకు తక్కువ సీట్లు పొందింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 115 సీట్ల ఆధిక్యంలో ఉన్నది. అయినా.. చివరి రౌండ్‌కు వచ్చే సరికి ఎన్ని సీట్లు వస్తాయో అనే ఆందోళన మాత్రం కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. అందుకే తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ముందస్తు జాగ్రత్తలు మొదలు పెట్టింది.

ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా సరే కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన అభ్యర్థులు అందరూ బెంగళూరు రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కనుక స్పష్టమైన ఆధిక్యత సాధిస్తే ఆదివారమే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థులుగా ఉన్న సిద్దిరామయ్య, శివకుమార్‌లు కూడా బెంగళూరులో ఏర్పాటు చేయనున్న సమావేశానికి రావాలని పిలుపు అందింది.

ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కనుక స్పష్టమైన ఆధిక్యత సాధించకపోతే.. జేడీఎస్‌తో సంప్రదింపులు జరపడానికి కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ కూడా ప్లాన్ బీ అమలుకు రెడీ అవుతున్నది. జేడీఎస్ నేతలను ఇప్పటికే సంప్రదించారని.. తప్పకుండా పార్టీకి సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి చివరి రౌండ్ ముగిసే సరికి 125 నుంచి 130 సీట్లు తప్పకుండా వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వమనే మాటే తలెత్తదని వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  13 May 2023 5:01 AM GMT
Next Story