Telugu Global
National

బీఆర్ఎస్ యూపీ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారి.. మహారాష్ట్రలో కీలక నియామకాలు

మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేస్తున్న సీఎం కేసీఆర్.. తాజాగా ఆరుగురు కోఆర్డినేటర్లను ఆ రాష్ట్రంలో నియమించారు. ఆ రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి పార్టీ తరపున ఒక కోఆర్డినేటర్‌ను ఎంపిక చేశారు.

బీఆర్ఎస్ యూపీ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారి.. మహారాష్ట్రలో కీలక నియామకాలు
X

భారత్ రాష్ట్ర సమితి కీలక నియామకాలు చేపట్టింది. జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు కిసాన్ సెల్‌ల నియామకాలు చేపట్టిన కేసీఆర్.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా అడుగు పెట్టారు. యూపీ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారీని నియమించారు. ఆయన జానుపూర్‌కు చెందిన రాజకీయ నాయకుడు. యూపీలో మంచి పేరున్ హిమాన్షు బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఇక మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఆరుగురు కోఆర్డినేటర్లను ఆ రాష్ట్రంలో నియమించారు. ఆ రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి పార్టీ తరపున ఒక కోఆర్డినేటర్‌ను ఎంపిక చేశారు. నాసిక్ డివిజన్‌కు అహ్మద్‌నగర్‌కు చెందిన దశరథ్ సావంత్, పూణే డివిజన్‌కు బాలా సాహెబ్ జైరామ్ దేశ్‌ముఖ్, ముంబై డివిజన్‌కు రాయ్‌గడ్‌కు చెందిన విజయ్ తానాజి మోహితే, ఔరంగబాద్ డివిజన్‌కు అహ్మద్ నగర్‌కు చెందిన సోమ్‌నాథ్ థోరాట్, నాగ్‌పూర్ డివిజన్‌కు ధ్యానేశ్ వాకుదార్, అమరావతి డివిజన్‌కు నిఖిల్ దేశ్‌ముఖ్‌లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ట్విట్టర్ ఖాతాలో కూడా వారి నియామక పత్రాలను పోస్టు చేశారు.

ఇప్పటికే మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడి బాధ్యతలను మాణిక్ కదమ్‌కు అప్పగించారు. తాజగా మహారాష్ట్రలో కోఆర్డినేటర్లను నియమించడమే కాకుండా.. యూపీలో కూడా కీలక పోస్టును భర్తీ చేశారు. బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా సీఎం కేసీఆర్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో.. ఈ నియామకాలే తెలియజేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.



First Published:  1 March 2023 8:39 AM GMT
Next Story