Telugu Global
National

పసికందు కిడ్నాప్ కేసులో బీజేపీ లీడర్ సహా 8 మంది అరెస్ట్!

ఉత్తరప్రదేశ్ మథుర రైల్వే స్టేషన్ లో ఓ పసికందును కిడ్నాప్ చేసి అమ్మేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ బీజేపీ కార్పోరేటర్ కూడా ఉన్నారు.

పసికందు కిడ్నాప్ కేసులో బీజేపీ లీడర్ సహా 8 మంది అరెస్ట్!
X

ఆగస్ట్ 24, అర్దరాత్రి...ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో తమ ఏడు నెలల పసివాడితో కలిసి ఓ కుటుంబం గాఢ నిద్రలో ఉంది. ఇంత లో ఓ వ్యక్తి అటు ఇటూ తిరిగి మెల్లెగా ఆ పసి కందును ఎత్తుకొని పరిగెత్తాడు. తల్లి తండ్రులు లేచి చూసుకునేసరికి తమ ఏడు నెలల కొడుకు కనిపించలేదు. బోరు బోరున విలపిస్తూ వాళ్ళు పోలీసులకు పిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా ఆ పసి వాడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని దీప్ కుమార్ గా గుర్తించి గాలింపు మొదలు పెట్టారు. ఐదు రోజుల తర్వాత, ఆగస్టు 29న సిసిటివి ఫుటేజ్, ఇన్ఫార్మర్ల సహాయంతో ఆ శిశువు ఎక్కడున్నాడో పోలీసులు కనిపెట్టారు. అంతే కాదు అదొక మానవ అక్రమ రవాణా రాకెట్ అని తెల్సుకున్నారు.

హత్రాస్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్న ఇద్దరు డాక్టర్లు ఈ రాకెట్ కు సూత్రదారులు. కిడ్నాపర్ దీప్ కుమార్ ఆ శిశువును ఆ డాక్టర్లకు ఇచ్చాడు. వాళ్ళు ఆ పసికందును 1.8 లక్షల రూపాయలకు భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ వినీతా అగర్వాల్ కు అమ్మారు.

ఈ రాకెట్ ను ఛేదించిన పోలీసులు కార్పోరేటర్, ఆమె భర్త‌ తో పాటు హత్రాస్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్రేమ్‌ బిహారీ, దయావతి, ఏఎన్‌ఎంలు పూనమ్‌, విమ్లేశ్‌, మంజీత్‌తో పాటు చిన్నారిని దొంగిలించిన దీప్‌కుమార్ లను అరెస్టు చేశారు.

దీనిపై రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ ముస్తాక్ మాట్లాడుతూ....

"సిసిటివి ఫుటేజ్, ఇన్ఫార్మర్ల సహాయంతో, హత్రాస్‌కు చెందిన దీప్ కుమార్ అనే వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేశాడని మేము తెలుసుకున్నాము. పొరుగున ఉన్న హత్రాస్ జిల్లాలో ఆసుపత్రిని నడుపుతున్న ఇద్దరు వైద్యులు నడుపుతున్న‌ ముఠాలో అతను భాగం" అని చెప్పారు.

"బిడ్డను కొన్న కార్పోరేటర్ ను విచారించగా వారికి ఒకే ఒక కుమార్తె ఉందని, ఒక కుమారుడు కావాలనే ఉద్దేశంతో ఈ బిడ్డను కొన్నట్టు వారు మాకు చెప్పారు. కార్పోరేటర్ తో పాటు ఆమె భర్త కూడా ఈ కుట్రలో భాగస్వామి" అని ముస్తాక్ తెలిపారు. కార్పోరేటర్ స్థానిక బీజేపీ నాయకుడు.


First Published:  30 Aug 2022 3:55 AM GMT
Next Story