Telugu Global
National

పార్టీ మారండి కేసులు కొట్టేస్తాం.. ఆప్ మంత్రికి బీజేపీ బంపర్ ఆఫర్..!

ఢిల్లీలో లిక్కర్ షాపుల కేటాయింపుల విషయంలో వచ్చిన ఆరోపణలు, ఆమ్ ఆద్మీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ విషయంలో ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే.

పార్టీ మారండి కేసులు కొట్టేస్తాం.. ఆప్ మంత్రికి బీజేపీ బంపర్ ఆఫర్..!
X

ఢిల్లీలో లిక్కర్ షాపుల కేటాయింపుల విషయంలో వచ్చిన ఆరోపణలు, ఆమ్ ఆద్మీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ విషయంలో ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొంతమంది నివాసాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది, ఈడీ కూడా ఈ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఢిల్లీ విద్యా విధానాలను ప్రశంసించిన రోజే.. లిక్కర్ పాలసీ విషయంలో ఏసీబీ దాడులు చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. దీనిపై ఆయనే స్వయంగా ట్వీట్ వేశారు.

కేసులు కొట్టేస్తాం.. పార్టీ మారండి..

ఆమ్ ఆద్మీ పార్టీని వ‌దిలేసి.. బీజేపీలో చేరితే త‌న‌పై ఉన్న అన్ని కేసులను కొట్టేస్తారని తనకి ఓ మెసేజ్ వచ్చిందని అంటున్నారు మనీష్ సిసోడియా. బీజేపీ నుంచి త‌న‌కు ఓ మెసేజ్ వ‌చ్చింద‌ని, ఆప్‌ను బ్రేక్ చేసి, బీజేపీలో చేరాల‌ని ఆ మెసేజ్‌లో ఉంద‌ని, మీపై ఉన్న అన్ని సీబీఐ, ఈడీ కేసుల‌ను తొల‌గిస్తామ‌ని ఆ మెసేజ్‌ లో పేర్కొన్నారని సిసోడియా ట్వీట్ లో తెలిపారు.

చావనైనా చస్తా..

త‌న‌పై అన్ని త‌ప్పుడు కేసులు బ‌నాయించార‌ని, నిజానిజాలు నిలకడపైన తేలుతాయని, ఈలోగా మీకు కావాల్సింది మీరు చేసుకోండని సిసోడియా ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చారట. తాను మ‌హారాణా ప్ర‌తాప్ అనుచ‌రుడిని, రాజ్ పుత్ ని అంటున్న సిసోడియా, కావాలంటే తల న‌రుక్కుంటాను కానీ, అవినీతి ఆరోపణలకు తలొంచనని చెప్పారు. బీజేపీకి లొంగేది లేదన్నారు. సిసోడియా ట్వీట్ పై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత మ‌నోజ్ తివారీ సిసోడియా ఆరోపణలను ఖండించారు. అవినీతిలో ఇరుక్కున్న సిసోడియా క‌ట్టు క‌థ‌లు చెబుతున్నార‌ని తివారీ ఆరోపించారు.



First Published:  22 Aug 2022 7:57 AM GMT
Next Story