Telugu Global
National

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20% పన్ను

కొద్దిరోజుల క్రితమే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేదం అమల్లోకి తెచ్చింది. దీంతో పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్ల బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి.

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20% పన్ను
X

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు, సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల బాస్మతీయేతర‌ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు, ఉప్పుడు బియ్యం ఎగుమతులకు సంబంధించి ప్రకటన చేసింది. వీటిపై ఆగస్టు 25 నుంచి 20 శాతం సుంకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ ఆంక్షలు అక్టోబర్ 16వ తేదీ దాకా కొనసాగుతాయని వివరించింది. అయితే ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పారాబాయిల్డ్ రైస్‌కు మాత్రం ఈ సుంకం వర్తించదని వెల్లడించింది. అలాగే ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ ఉన్న ఎగుమతులకూ సుంకం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

కొద్దిరోజుల క్రితమే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేదం అమల్లోకి తెచ్చింది. దీంతో పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్ల బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. ఈ దెబ్బకి ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగుమతులను అదుపులో ఉంచేందుకు ఈ సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగే ఉల్లిగడ్డల ధరల నియంత్రణ కోసం గత వారం ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకొద్ది నెలల్లో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

*

First Published:  26 Aug 2023 9:31 AM GMT
Next Story