Telugu Global
National

ఉల్లి ఎగుమతులపై నిషేధం

ఉల్లిపాయలు చాలా రోజులుగా అధిక ధరలు పలుకుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇది మోయలేని భారంగా మారింది.

ఉల్లి ఎగుమతులపై నిషేధం
X

ఉల్లిపాయల ధరలు మండిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిబంధన తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించింది. నేటి నుంచే ఈ నిషేధం అమల్లో ఉంటుంది. 2024 మార్చి 31 వరకు ఈ నిబంధ‌న కొనసాగుతుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

దేశంలో ఉల్లిపాయలు చాలా రోజులుగా అధిక ధరలు పలుకుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇది మోయలేని భారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటి ధరల కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడైన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడును ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

First Published:  8 Dec 2023 8:43 AM GMT
Next Story