Telugu Global
National

బస్సు లోయలో పడి.. 36 మంది మృతి

ప్రమాదానికి గురైన బస్సు దాదాపు 55 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం కిష్త్యాడ్‌ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌–అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి లోయలో ప‌డిపోయింది.

బస్సు లోయలో పడి.. 36 మంది మృతి
X

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. 300 అడుగుల లోయలో ప‌డి 36 మంది మృతిచెందారు. మరో 19 మంది గాయాలపాలయ్యారు. జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్‌–కిష్త్వాడ్‌ జాతీయ రహదారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బస్సు కిష్త్వాడ్‌ నుంచి జమ్మూకి వెళుతుండగా లోయలోకి జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు.

ప్రమాదానికి గురైన బస్సు దాదాపు 55 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం కిష్త్యాడ్‌ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌–అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి లోయలో ప‌డిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు.

ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

డోడాలో బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

First Published:  15 Nov 2023 12:57 PM GMT
Next Story