Telugu Global
National

అదానీ స్కాంపై రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బీఆరెస్ - తిరస్కరించిన చైర్మెన్

అదానీ వల్ల దేశ‌ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ప్రమాదాలకు గురయ్యిందో నివేదిక వెల్లడించిందని రాజ్యసభ ఛైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో కేకే పేర్కొన్నారు.

అదానీ స్కాంపై రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బీఆరెస్ - తిరస్కరించిన చైర్మెన్
X

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రూప్‌కు చెందిన ఇతర కంపెనీల గురించి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఎంపి కె కేశవ రావు బుధవారం రాజ్యసభలో రూల్ 267 ప్రకారం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మెన్ దాన్ని తిరస్కరించారు.

అదానీ వల్ల దేశ‌ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ప్రమాదాలకు గురయ్యిందో నివేదిక వెల్లడించిందని రాజ్యసభ ఛైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో కేకే పేర్కొన్నారు.

“ఈ రోజు (8.2.2023) ఎజెండాలో జాబితా చేయబడిన బిజినెస్ ను ఈ సభ తాత్కాలికంగా నిలిపివేసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్,అతని గ్రూప్‌లోని ఇతర కంపెనీల గురించి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చను చేపట్టాలని నేను వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. సర్, ఈ నివేదిక భారతీయ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుందో బహిర్గతం చేస్తుంది. అందువల్ల ఈ అంశం తక్షణ చర్చకు అర్హమైనది. ”అని కేకే తన వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు.

ఇదే అంశంపై రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన థాకరే వర్గం కూడా వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టగా రాజ్యసభ సైర్మెన్ వాటిని కూడా తిరస్క‌రించారు. దీంతో మూడు పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

.

First Published:  8 Feb 2023 10:07 AM GMT
Next Story