Telugu Global
National

ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం లభ్యం

దీనిపై పీయూష్ తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం లభ్యం
X

ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిసువా నియోజకవర్గ ఎమ్మెల్యే నీతు కుమారి ఇంట్లో నరహట్ ప్రాంతానికి చెందిన పీయూష్ అనే యువకుడి మృతదేహం లభించింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఎమ్మెల్యే నీతు కుమారి నివాసంలో పార్టీ చేసుకుందామని.. అందుకోసం చికెన్, బ్రెడ్ తీసుకుని రావాలని ఎమ్మెల్యే బావ కుమారుడు అయిన గోలు సింగ్ నరహట్‌కు చెందిన టున్ టున్ సింగ్ కుమారుడు పీయూష్‌ని పురమాయించాడు.

పీయూష్ చికెన్, బ్రెడ్ తీసుకొని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే నీతు కుమారి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ గోలు సింగ్, పీయూష్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఏదో విషయమై వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఆగ్ర‌హించిన గోలు సింగ్ పీయూష్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎమ్మెల్యే నివాసంలోని ఓ గదిలో దాచాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం దాటినా కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో పీయూష్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అతడి కోసం ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ గదిలో పీయూష్ మృతదేహం కనిపించింది. దీనిపై వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు.

First Published:  29 Oct 2023 12:31 PM GMT
Next Story