Telugu Global
National

అప్పుల కుప్పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆదాయం వడ్డీలకే సరి

విచిత్రం ఏంటంటే.. ఆదాయంలో అత్యథిక శాతం రుణాలకు, వడ్డీలకు చెల్లిస్తున్న రాష్ట్రాలన్నీ బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి.

అప్పుల కుప్పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆదాయం వడ్డీలకే సరి
X

బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయి. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ కేంద్రం కబుర్లు చెప్పుకుంటున్నా, దేశంలో అత్యథిక వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్.. అత్యథికంగా వడ్డీలు చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

అప్పులు ఎక్కువగా తెస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ తప్పారంటూ ఇటీవల కొన్ని రాష్ట్రాలకు రుణ పరిమితి విధించింది కేంద్రం. తెలంగాణను కూడా ఈ విషయంలో హెచ్చరించింది. కానీ విచిత్రం ఏంటంటే.. ఆదాయంలో అత్యథిక శాతం రుణాలకు, వడ్డీలకు చెల్లిస్తున్న రాష్ట్రాలన్నీ బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యథికంగా 43,530 కోట్ల రూపాయలను వడ్డీకింద చెల్లించింది. మహారాష్ట్ర 42,998 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. కర్నాటక, గుజరాత్ కూడా చెరో పాతిక కోట్లకు పైగా వడ్డీలకు జమ చేశాయి. ఇక కేంద్రం విమర్శించిన తెలంగాణ వడ్డీలకు చెల్లించింది కేవలం 17,584కోట్ల రూపాయలు. ఈ లెక్కన చూస్తే అత్యథికంగా వడ్డీలు కడుతూ రాష్ట్ర ఆదాయాన్ని దుబారా చేస్తోంది ఎవరు, అక్కడ ఎవరి ఏలుబడి ఉందనే విషయాలు ఇప్పుడు హైలెట్ గా మారుతున్నాయి.

ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేళ్ల వ్యవధిలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బీజేపీ పాలిత రాష్ట్రాలు అంతకంటే రెట్టింపు రుణాలు తీసుకున్నాయి. కర్నాటక రూ.1.23 లక్షల కోట్ల రుణాలు సేకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హర్యానా తమ ఆదాయంలో 35.3 శాతం, ఉత్తరప్రదేశ్‌ 34.2 శాతం, ఉత్తరాఖండ్‌ 30.3 శాతం, మధ్యప్రదేశ్‌ 29 శాతం మేర అప్పులు చేశాయి. తెలంగాణ చేసిన రుణాలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలను బట్టి తెలుస్తోంది. జీఎస్డీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం కేవలం 27.4 శాతం మాత్రమే.

First Published:  8 Dec 2022 4:35 AM GMT
Next Story