Telugu Global
National

బీజేపీ ఓ సీరియల్ కిల్లర్ : అరవింద్ కేజ్రివాల్

బీజేపీని 'ఓ సీరియల్ కిల్లర్' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఓ సీరియల్ కిల్లర్ : అరవింద్ కేజ్రివాల్
X

బీజేపీని 'ఓ సీరియల్ కిల్లర్' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను వరుసగా చంపేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ అని శుక్రవారం అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చి వేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందని.. అయితే ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆప్ నుంచి తీసుకొని వెళ్లలేకపోయారని కేజ్రివాల్ అన్నారు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీలో బల పరీక్షకు సిద్దపడతానని.. ఎమ్మెల్యేలందరూ పార్టీలోనే ఉన్నారని నిరూపిస్తానని అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో కేజ్రివాల్ మాట్లాడుతూ.. తాను విశ్వాస పరీక్షకు సిద్దపడుతున్నానని చెప్పారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా పై పలు ఆరోపణలు చేస్తున్నారని.. ఆపరేషన్ లోటస్‌లో భాగంగానే ఇవి జరగుతున్నాయని కేజ్రివాల్ అన్నారు. లిక్కర్ పాలసీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కేంద్ర దర్యప్తు సంస్థలను రంగంలోకి దించిందని ఆయన అన్నారు. ఈ విషయాలన్నీ చర్చించడానికే ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గురువారం అరవింద్ కేజ్రివాల్ ఇంటికి 62 మంది ఎమ్మెల్యేలకు గాను 53 మంది వచ్చారు. మిగిలిన వాళ్లు కొన్ని పనుల కారణంగా రాలేకపోయారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇవ్వాళ సెషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కాగా, మనీశ్ సిసోడియాను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని.. చివరకు ఆయన ఇంటిలో జరిపిన సోదాల్లో పావలా కూడా పట్టుకోలేక పోయారని కేజ్రివాల్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత రోజు సిసోడియాను బీజేపీ నేత ఒకరు కలిసి చీఫ్ మినిస్టర్‌ను చేస్తామని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు కేజ్రివాల్ ఆరోపించారు. మనీశ్ ఈ ప్రతిపాదన తిరస్కరించడంతో ఇతర ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు కేజ్రివాల్ చెప్తున్నారు. నా పార్టీ ఎమ్మెల్యేలు వజ్రాలు.. వారిని కొనలేరని కేజ్రివాల్ చెప్పారు.

First Published:  26 Aug 2022 3:32 PM GMT
Next Story