Telugu Global
National

మళ్లీ ఇరుక్కున్న రాహుల్ గాంధీ!

"మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీ వాళ్లు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. అందుకే దొడ్డిదారిన కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నారు.

మళ్లీ ఇరుక్కున్న రాహుల్ గాంధీ!
X

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. రాహుల్ ఆరోపణలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరీ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే.. "ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం. 400 సీట్లు దాటేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే అంపైర్లను ఎంచుకున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవొచ్చు. దీనిని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. ఇదే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను మోడీ లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేస్తున్నారు. అంపైర్లను ఇప్పటికే ఎంచుకున్నారు".

"మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీ వాళ్లు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. అందుకే దొడ్డిదారిన కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్‌ అతిపెద్ద ప్రతిపక్షం. మేం ప్రచారం చేసుకోవాలి. కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టర్లు అంటించాలి. ఇలాంటి కీలక సమయంలో మా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. అసలు ఇవేం ఎన్నికలు" అంటూ రాహుల్‌గాంధీ బీజేపీపై, మోడీపై మండిపడ్డారు. ఇక ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులను రాహుల్ గాంధీ ఎదుర్కున్నారు. తాజాగా మ్యాచ్‌ ఫిక్సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ ఈసీని ఆశ్రయించింది.

First Published:  1 April 2024 4:13 PM GMT
Next Story