Telugu Global
National

ఈ రాష్ట్రపతి ఎన్నికలో బేరసారాలు జరుగుతున్నాయి... యశ్వంత్ సిన్హా ఫైర్

రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ చురుగ్గా సాగుతున్న వేళ... విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ..బీజేపీపై ఫైరయ్యారు. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనదని, దేశ ప్రజాస్వామ్యం ఉంటుందా లేక అంతమవుతుందా అనడానికి ఈ ప్రక్రియ ఓ మార్గాన్ని 'సెట్' చేస్తుందని వ్యాఖ్యానించిన ఆయన.. ఓటర్లంతా తమ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని కోరారు.

ఈ రాష్ట్రపతి ఎన్నికలో బేరసారాలు జరుగుతున్నాయి... యశ్వంత్ సిన్హా ఫైర్
X

రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ సాగుతున్న వేళ... విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ..బీజేపీపై ఫైరయ్యారు. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనదని, దేశ ప్రజాస్వామ్యం ఉంటుందా లేక అంతమవుతుందా అనడానికి ఈ ప్రక్రియ ఓ మార్గాన్ని 'సెట్' చేస్తుందని వ్యాఖ్యానించిన ఆయన.. ఓటర్లంతా తమ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని కోరారు. ఇది రహస్య బ్యాలట్..అని, వీరంతా తమ మనస్సాక్షిని బట్టి , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. పార్లమెంట్ బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో సభ్యుల కొనుగోళ్ళకు బేరసారాలు జరుగుతున్నాయని, 'గేమ్ ఆఫ్ మనీ' (డబ్బు సంచుల క్రీడ) వ్యవహారం సాగుతోందని ఆరోపించారు. ఇందుకు అధికార పార్టీ ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటోందని అన్నారు. నాకు వ్యతిరేకంగా (నన్నుఓడించడానికి) మనీ పవర్ ని వాడుతున్నారు.. కేంద్ర సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారు..బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆయా ప్రభుత్వాలను పడగొట్టడానికి వీటిని అన్నివిధాలుగా వాడుకొంటున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేయడం లేదని, ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాడుతున్నానని సిన్హా చెప్పారు. అవి పార్టీలను చీలుస్తున్నాయని, తమఅభ్యర్థికే ఓటు వేయాలని బలవంతం చేస్తున్నాయని ఆయన చెప్పారు.

ఒకప్పుడు నేనూ మీ పార్టీవాడినే.. సిన్హా

రాష్ట్రపతి ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు యశ్వంత్ సిన్హా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే ఓటు వేయవలసిందిగా ఆయన బీజేపీ నేతలను కోరారు. లోగడ తను కూడా బీజేపీకి చెందినవాడినేనని గుర్తు చేశారు. కానీ లోగడ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి వారు నేతృత్వం వహించిన పార్టీ పోయి..ఇప్పుడు ఒకే ఒక నాయకుడి కిందకు పార్టీ వచ్చిందన్నారు. ఈ నాయకత్వం పూర్తి విభిన్నంగా ఉందని, పార్టీని కిందికి దిగజార్చిందని సిన్హా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, డెమాక్రసీని, సెక్యులరిజాన్ని కాపాడేందుకు మీ పార్టీ ఏదైనా సరే.. తనకే ఓటు వేయాలని ఆయన దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక చివరి ఛాన్స్ అని సభ్యులంతా తమ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవాలని అన్నారు.

అయితే సోమవారం ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన బీజేపీపై విరుచుకుపడడం విశేషం. ఈ ఎన్నికకు విప్ లంటూ ఎవరూ లేరని, రహస్యంగా ఓటింగ్ సాగుతోంది గనుక ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇలా తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ఆయన మరీ మరీ కోరారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ యశ్వంత్ సిన్హా.. బీజేపీని టార్గెట్ చేశారు. కాగా ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసేందుకు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులతో నిన్ననే వరుసగా సమావేశాలు నిర్వహించాయి. రాష్ట్రం నుంచి సుమారు 200 మంది ఎమ్మెల్యేల మద్దతు ద్రౌపది ముర్ముకు ఉందంటూ సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ప్రకటన పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.




First Published:  18 July 2022 8:50 AM GMT
Next Story