Telugu Global
National

గత ఐదేళ్ళ‌ల్లో 10 లక్షల కోట్లకు పైగా రుణాలు రద్దు - నిర్మలా సీతారామన్ వెల్లడి

ఈ మొండి బకాయిల విషయంలో బ్యాంకు అధికారులదే ప్రధాన బాధ్యత అని నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారులు నిర్దేశించిన విధానాలను పాటించకపోవడం, విధినిర్వహణ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వంటి చర్యల వల్ల మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆమె తెలిపారు.

గత ఐదేళ్ళ‌ల్లో 10 లక్షల కోట్లకు పైగా రుణాలు రద్దు - నిర్మలా సీతారామన్ వెల్లడి
X

గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు 10,09,511 కోట్ల రూపాయల మొండి బకాయిలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు.

"బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను క్లీన్ గా ఉంచడానికి, పన్ను ప్రయోజనాలను పొందేందుకు, మూలధనాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, RBI మార్గదర్శకాలు, పాలసీకి అనుగుణంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) లను రద్దు చేస్తాయి. RBI, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (SCBలు) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొత్తాన్ని రద్దు చేశాయి'' అని ఆమె చెప్పారు.

బ్యాంకులు రైటాఫ్ చేసినప్పటికీ రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రైటాఫ్ వల్ల రుణ గ్రహీతలకు ఎలాంటి లాభముండదని ఆమె చెప్పారు.

గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రైటాఫ్ లోన్ ఖాతాల నుంచి రూ.1,32,036 కోట్ల రికవరీ సహా మొత్తం రూ.6,59,596 కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయని ఆమె తెలిపారు.

ఈ మొండి బకాయిల విషయంలో బ్యాంకు అధికారులదే ప్రధాన బాధ్యత అని నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారులు నిర్దేశించిన విధానాలను పాటించకపోవడం, విధినిర్వహణ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వంటి చర్యల వల్ల మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆమె తెలిపారు. ఇలాంటి అధికారులపై త్వరలో చర్యలు ప్రారంభించబడతాయని ఆమె చెప్పారు.

రద్దు చేయబడిన ఈ 10,09,511 కోట్ల రూపాయల రుణాలు పెద్ద పారిశ్రామిక వేత్తలు, కార్పోరేట్ కంపెనీలవే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

First Published:  13 Dec 2022 10:47 AM GMT
Next Story