Telugu Global
National

ఓ ఇంట్లోకి దూరి ఐదుగురు వ్యక్తులపై దాడి చేసిన భజరంగ దళ్ కార్యకర్తలు... బాధితులను జైలుకు పంపిన పోలీసులు

ఓ ఇంట్లోకి దూరి ఐదుగురు వ్యక్తులపై దాడి చేసిన భజరంగ దళ్ కార్యకర్తలు... బాధితులను జైలుకు పంపిన పోలీసులు
X

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జనవరి 21 వ తేదీ నాడు 24 ఏళ్ళ ఓ హిందూ యువతి తన ఇ‍ంట్లో స్నేహితులతో కలిసి త‌న పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటో‍ంది. అయితే ఆమె తన పార్టీకి ఆహ్వానించిన ఆమె స్నేహితులు ముస్లిం యువకులు. ఇది తెలుసుకున్న బహరంగ్ దళ్ సభ్యులు 100 మందిని వెంటేసుకొని వచ్చి ఆ యువతి ఫ్లాట్ లోకి బలవంతంగా దూరి యువకులను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. వాళ్ళు లవ్ జీహాదీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఐదుగురు ముస్లిం యువకులను ఇండోర్‌లోని ఎంఐజీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ ముస్లిం యువకులను పార్టీకి పిలిచిన హిందూ యువతితో మాట్లాడకుండానే బజరంగ్ దళ్ వారిచ్చిన పిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 151 (ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఉండి ప్రజా శాంతికి విఘాతం కలిగించే అవకాశం) కింద జైలుకు పంపించారు.

యువకులను బజరంగ్ దళ్ కార్యకర్త‌లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో జనవరి 22 ఆదివారం నాడు వైరల్ అయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ''కొంతమంది యువకుల‌ను బజరంగ్ దళ్ సభ్యులు MIG కాలనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు, ఆ తర్వాత వారిలో ఐదుగురిని సెక్షన్ 151 కింద జైలుకు పంపించాం'' అని చెప్పారు..

అయితే, ప్రైవేట్ నివాసంలోకి ప్రవేశించి యువకుల‌ను కొట్టిన గుంపు పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

MIG స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ వర్మ ఓ ప్రముఖ వెబ్ పోర్ట్ ల్ తో మాట్లాడుతూ,

"మరింత వివాదాన్ని నివారించడానికి, IPC సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపాము. వారందరినీ రేపు (ఆదివారం) విడుదల చేస్తారు." అన్నారు.

అయితే జనవరి 23, సోమవారం ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి కూడా వారిని జైలు నుండి విడుదల చేయ‌లేదు.

అంతకుముందు, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సీమా శర్మ మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది, పురుషులు, మహిళల బృందం స్నేహితురాలి పుట్టినరోజును జరుపుకుంటున్నారని, ఈ విషయంలో ఆ పార్టీలో పాల్గొన్న అమ్మాయిలు "లవ్ జిహాద్ గురించి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని" స్పష్టం చేశారు.

దీనిపై బజరంగ్ దళ్ సభ్యులు ఏమంటున్నారంటే...?

భజరంగ్ దళ్ జిలా సంయోజక్ (జిల్లా సమన్వయకర్త) అని తనకు తాను చెప్పుకుంటున్న మనోజ్ యాదవ్ అనే వ్యక్తి మాట్లాడుతూ...

ఇండోర్‌లోని శ్రీ నగర్ ప్రాంతంలో ఐదుగురు ముస్లిం పురుషులు, ఇద్దరు హిందూ మహిళలు (కలిసి ఉన్నారని) సమాచారం అందుకున్న తర్వాత, మేము అక్కడికి వెళ్లి వారి గదులను వెతికాము. మద్యం బాటిళ్లతోపాటు మత్తు పదార్థాలు దొరికాయి. వారిని ఎంఐజీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.'' అని చెప్పాడు.

సుప్రీంకోర్టులో న్యాయవాది ఎహ్తేషామ్ హష్మీ పోలీసుల చర్యను ఖండించారు. అతిక్రమణ, దాడి, నేరపూరిత బెదిరింపు, సమూహాల మధ్య మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు బజరంగ్ దళ్ సభ్యుల మీద చర్య తీసుకోకుండా బాధితులను అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. స్నేహితురాలి పుట్టినరోజు జరుపుకోవడమే వాళ్ళు చేసిన తప్పా ? అని ఆయన ప్రశ్నించారు.


First Published:  23 Jan 2023 8:45 AM GMT
Next Story