Telugu Global
National

నగరాల్లో భారీగా పెరుగుతున్న అద్దెలు

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అద్దెలు పెరుగుతున్నట్టు ఆన్ రాక్ సంస్థ తేల్చింది. సగటున 23 శాతం మేర అద్దెలు పెరుగుతున్నాయట.

నగరాల్లో భారీగా పెరుగుతున్న అద్దెలు
X

వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో క్రమంగా మార్పు వస్తోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు హైబ్రిడ్ విధానంలోకి వచ్చేశాయి. ఉద్యోగులంతా వారానికి రెండు రోజులు కచ్చితంగా ఆఫీస్ కి రావాల్సిందేనంటున్నారు యజమానులు. అదేసమయంలో లే ఆఫ్ ల భయం కూడా ఉద్యోగుల్ని వెంటాడుతోంది. దీంతో వారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ లేకపోయినా కంపెనీల దగ్గర బెట్టు చూపించలేని పరిస్థితి. అంటే దాదాపుగా ఐటీ సంస్థలన్నీ మళ్లీ ఉద్యోగులతో కళకళలాడబోతున్నాయన్నమాట. ఈ దశలో ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దెలు పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ముగిసిపోతుండటంతో అద్దెలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అద్దెలు పెరుగుతున్నట్టు ఆన్ రాక్ సంస్థ తేల్చింది. సగటున 23 శాతం మేర అద్దెలు పెరుగుతున్నాయట. 2019లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ డబుల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె రూ. 15,500గా ఉంటే, ఇప్పుడది 19వేలకు చేరుకుంది. 23 శాతం పెరుగుదల నమోద చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, నొయిడా, హైదరాబాద్, చెన్నై నగరాల్లో అద్దెలు పెరిగిపోతున్నాయి. అత్యథికంగా నొయిడాలో రెంట్ లు పెరిగాయని ఆన్ రాక్ సర్వేలో తేలింది.

సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న మార్పులే దీనికి ప్రధాన కారణం అని తేలింది. ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండటంతో.. హైబ్రిడ్ మోడ్ అయినా సరే ఇల్లు అద్దెకు తీసుకోడానికే ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగుతోంది. అదే సమయంలో అద్దెలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా సగటున 25 శాతం మేర అద్దెలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 2019తో పోల్చి చూస్తే, ఇప్పుడు స్పష్టంగా తేడా కనపడుతోంది. కరోనా టైమ్ లో ఖాళీగా ఉన్న బిల్డింగ్ లన్నీ ఇప్పుడు పూర్వ స్థితికి వచ్చేశాయి.

First Published:  13 Feb 2023 6:49 AM GMT
Next Story