Telugu Global
National

మధ్యప్రదేశ్ మంత్రిపై దురద పౌడర్ తో దాడి.. ఆగిన రథయాత్ర

భోపాల్ లో మంత్రి బిజేంద్ర సింగ్ రథయాత్ర నిర్వహిస్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి మంత్రిపై దురద పౌడర్ చల్లాడు. దీంతో బిజేంద్ర సింగ్ వాహనం దిగి రోడ్డుపైకి వచ్చారు.

మధ్యప్రదేశ్ మంత్రిపై దురద పౌడర్ తో దాడి.. ఆగిన రథయాత్ర
X

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ప్రజల మధ్యకు వచ్చిన నేతలపై దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఒక మహిళా ఎమ్మెల్సీ ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని పరిణామానికి ఎమ్మెల్సీ బిత్తర పోయారు. తాజాగా మధ్యప్రదేశ్ లో రథయాత్ర చేపట్టిన మంత్రి బిజేంద్ర సింగ్ పై గుర్తుతెలియని వ్యక్తి దురద పౌడర్ చల్లాడు. దీంతో భరించలేని దురదతో మంత్రి ఇబ్బందులు పడ్డారు. తాను నిర్వహిస్తున్న రథయాత్రను కూడా నిలిపివేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు మంత్రి బిజేంద్ర సింగ్ `వికాస్ యాత్ర` పేరిట రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్రను గత ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనుంది.

కాగా, తాజాగా భోపాల్ లో మంత్రి బిజేంద్ర సింగ్ రథయాత్ర నిర్వహిస్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి మంత్రిపై దురద పౌడర్ చల్లాడు. దీంతో బిజేంద్ర సింగ్ వాహనం దిగి రోడ్డుపైకి వచ్చారు. దురద భరించలేనంతగా ఉండటంతో వేసుకున్న కుర్తా తీసేసి చేతులు, భుజాలను కడుక్కోవడం ప్రారంభించాడు.

అయితే మంత్రి దురద భరించలేక ఒళ్లు కడుక్కుంటుండగా కొందరు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గుర్తుతెలియని వ్యక్తి దురద పౌడర్ చల్లడంతో బిజేంద్ర సింగ్ నిర్వహిస్తున్న రథయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

First Published:  10 Feb 2023 11:26 AM GMT
Next Story