Telugu Global
National

ఏపీకి మూడు రాజధానులు, దేశానికి ఐదు రాజధానులు..?

ఏపీ మూడు రాజధానులనుంచి పాలన ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం అంతు చిక్కకుండా ఉంది. ఈ దశలో దేశానికి ఐదు రాజధానులు కావాలంటూ అస్సోం సీఎం మరో బాంబు పేల్చారు.

ఏపీకి మూడు రాజధానులు, దేశానికి ఐదు రాజధానులు..?
X

ఏపీకి మూడు రాజధానులు అనే అంశం ఎటో మొదలే, చివరకు ఎటో వెళ్లిపోయింది. ఇప్పుడా ప్రతిపాదన ఉందా.. లేదా.., ఉంటే ఆయా రాజధానులనుంచి పాలన ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం అంతు చిక్కకుండా ఉంది. ఈ దశలో దేశానికి ఐదు రాజధానులు కావాలంటూ అస్సోం సీఎం మరో బాంబు పేల్చారు. అయితే ఆయన దీన్ని సీరియస్ గా అన్నారా.. లేక కేజ్రీవాల్ కి కౌంటర్ గా అన్నారా.. అనేది మాత్రం సస్పెన్స్. ఐదు రాజధానులతో ఈశాన్య భారతానికి మేలు జరుగుతుందనే భావన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మకు ఉంది. అందుకే అది సాధ్యం కాదని తెలిసినా.. ఈశాన్య భారతంపై చిన్నచూపు తగదంటూ ఆయన కేజ్రీవాల్ కి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల అస్సోంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు ఎక్కుపెట్టారు. జీరో రిజల్ట్ వచ్చాయన్న కారణంతో పాఠశాలల మూసివేత సమస్యకు పరిష్కారం కాదని సూచించారాయన. ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన అస్సోంని ఉదాహరణగా చూపిస్తూ కౌంటర్లు ఇచ్చారు. కానీ అస్సోం సీఎం మాత్రం ఈశాన్య రాష్ట్రాలపై ఎందుకంత కడుపు మంట అంటూ బదులిచ్చారు. అదే సమయంలో ప్రాంతీయ అసమానతలు తొలగిపోవాలంటే దేశానికి అయిదు రాజధానులు ఉండాలని అన్నారాయన.

ఢిల్లీలాంటి చోట సంపద పోగుపడటం వల్లే ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు అస్సోం సీఎం బిశ్వశర్మ. అందుకే ఈశాన్య రాష్ట్రాలు నిర్యక్ష్యానికి, తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఇకపై ఇలా సంపద పోగుపడకుండా, ప్రతి జోన్‌ కి ఒక రాజధాని ఏర్పాటు చేయాలని, దేశం మొత్తానికి ఐదు రాజధానులు ఉండాలన్నారు.

First Published:  30 Aug 2022 2:33 AM GMT
Next Story