Telugu Global
National

నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల నేపథ్యంలో జిహాద్ కు అల్‌-ఖైదా పిలుపు

నుపుర్ శర్మపై ప్రతీకారం తీర్చుకోవాలని అల్‌-ఖైదా పిలుపునిచ్చింది.శ‌త్రువులకు వ్య‌తిరేకంగా త‌మ‌కు తాము ఆయుధాలుగా మారి జిహాద్ లో పాల్గొనాలని కూడా అల్‌-ఖైదా తన కార్యకర్తలను కోరింది.

నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల నేపథ్యంలో జిహాద్ కు అల్‌-ఖైదా పిలుపు
X

మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ పై ప్రతీకారం తీర్చుకోవాలని అల్‌-ఖైదా పిలుపునిచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం పేర్కొంది. ఈమేరకు అల్‌-ఖైదా మౌత్ పీస్ 'నవా-ఎ-ఘవా-ఎ-హింద్' లో నూపుర్ శర్మ చేసిన "దైవ దూషణ" వ్యాఖ్య‌ల గురించి వివరంగా ఉటంకిస్తూ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చిందని ఆ ప‌త్రిక పేర్కొంది. శ‌త్రువులకు వ్య‌తిరేకంగా త‌మ‌కు తాము ఆయుధాలుగా మారి జిహాద్ లో పాల్గొనాలని,కశ్మీర్ లో కూడా " జిహాద్"లో పాల్గొనాలని అల్‌-ఖైదా పిలుపునిచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ర‌చ‌యిత సాల్మ‌న్ ర‌ష్దీ పై ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు హైఅల‌ర్ట్ లో ఉన్నాయి. భార‌త‌దేశంలో ఉగ్రవాద దాడులు చేస్తామని ఈ యేడాది జూన్ లో ఇస్లామిక్ స్టేట్ ఖుర్స‌న్ ప్రావిన్స్-ఐఎస్ కె పి హెచ్చ‌రించింది. అంతకుముందు, భారత్‌పై దాడులు చేయాలంటూ 50 పేజీల డాక్యుమెంట్ ను ఐఎస్ కెపి విడుదల చేసింది.

ప్రవక్త మొహమ్మద్‌ను అవమానించినందుకు ప్రతీకారంగా భారతీయ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు చేస్తామని హెచ్చరిస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఎక్యుఐఎస్‌) కూడా లేఖ విడుద‌ల చేసింది.

జూన్ 6 నాటి బెదిరింపు లేఖలో, ప్రవక్త గౌరవాన్నికాపాడేందుకు ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆత్మాహుతి దాడులు చేస్తామని ఎక్యుఐఎస్ పేర్కొంది. ఈ ముప్పు గురించి అన్ని రాష్ట్రాలకు నిఘా వర్గాలు సమాచారం అందించి అప్ర‌మ‌త్తం చేశాయి.

నూపుర్ శ‌ర్మకు మద్దతు ఇచ్చినందుకు ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య కుమార్, అమరావతి ఫార్మసిస్ట్ ఉమేష్ కోల్హేలను హత్య చేసిన నేపథ్యంలో ఈ బెదిరింపులు వచ్చాయి.

ప్రవక్తపై శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, హింసాత్మక నిరసనలు జ‌రిగిన‌ప్ప‌టినుంచి ఆమె ఒక గుర్తు తెలియని ప్రదేశంలో పోలీసు రక్షణలో ఉంటున్నారు. హత్య చేస్తామంటూ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇటీవల ఆమెకు భద్రతను పెంచారు.

First Published:  15 Aug 2022 3:46 PM GMT
Next Story