Telugu Global
National

డ్రగ్స్‌ కేసుపై వరలక్ష్మి శరత్‌కుమార్‌ క్లారిటీ

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌ కేసుపై వరలక్ష్మి శరత్‌కుమార్‌ క్లారిటీ
X

డ్రగ్స్‌ కేసులో తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంపై సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, అవికాగోర్, సత్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ వెబ్‌ సిరీస్‌ ’మాన్షన్‌ 24’. ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ డ్రగ్స్‌ కేసు గురించి మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదని చెప్పారు. గతంలో తన వద్ద ఆదిలింగం అనే వ్యక్తి ఫ్రీలాన్స్‌ మేనేజర్‌గా వర్క్‌ చేశారని, ‘సర్కార్‌’తో పాటు ఆయన తీసుకొచ్చిన మూడు నాలుగు సినిమాల్లో తాను నటించానని తెలిపారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఆయన పేరుతో వార్తలు వచ్చాయని, దానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో తన ఫొటోని ఉపయోగించి ’వరలక్ష్మి మేనేజర్‌కి నోటీసులు’ అని వార్తలు వేస్తున్నారని తెలిపారు. అంతే తప్ప ఆ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

పదేళ్లలో 50 సినిమాలు చేయడం సులభం కాదు...

అనంతరం వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడారు. పదేళ్ల కాలంలో 50 సినిమాలు చేయడం అంత సులభం కాదని ఈ సందర్భంగా చెప్పారు. కెరీర్‌ ఆరంభంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నానని, ఎంతో కష్టపడి ఇక్కడి వరకూ వచ్చానని చెప్పారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. వాళ్లు తననెంతో ప్రోత్సహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అందుకే తాను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యానని చెప్పారు. ’మాన్షన్‌ 24’ సిరీస్‌లో తాను సత్యరాజ్‌ కుమార్తెగా నటించానని చెప్పారు. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.


First Published:  4 Oct 2023 12:45 PM GMT
Next Story