Telugu Global
National

అంబేద్కర్, భగత్ సింగ్, పెరియార్, మార్క్స్ ఫోటోలను ధ్వంసం చేసి, తమిళనాడు విద్యార్థులపై దాడి చేసిన‌ ఏబివిపి... జేఎన్యూ లో ఉద్రిక్తం

తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ తమిళ విద్యార్థులపై దాడిని ఖండించారు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమిళనాడు విద్యార్థులను రక్షించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు.

అంబేద్కర్, భగత్ సింగ్, పెరియార్, మార్క్స్ ఫోటోలను ధ్వంసం చేసి, తమిళనాడు విద్యార్థులపై దాడి చేసిన‌ ఏబివిపి...   జేఎన్యూ లో ఉద్రిక్తం
X

ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే తదితరుల చిత్రాలను ధ్వంసం చేశారు, అడ్డుకున్న పలువురు తమిళనాడుకు చెందిన విద్యార్థులపై దాడికి దిగారు.

“ పెరియార్, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే, అనేక ఇతర చిహ్నాల చిత్రాలను ఏబీవీపీ ధ్వంసం చేసింది. స్టుడెంట్ యూనియన్ కార్యాలయం లోపల గోడలను కూడా ABVP ధ్వంసం చేసింది” అని JNUSU అధ్యక్షురాలు ఐషే ఘోష్ ట్వీట్ చేశారు.

క్యాంపస్‌లో మత సామరస్యానికి భంగం కలిగించేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందని ఘోష్ ఆరోపించారు. "SU కార్యాలయంలో విధ్వంసాన్ని, విద్యార్థులపై హింసను ఖండిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కూడా తమిళ విద్యార్థులపై దాడిని ఖండించారు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమిళనాడు విద్యార్థులను రక్షించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు.

“JNUలో పెరియార్, కార్ల్ మార్క్స్ వంటి నాయకుల చిత్రాలను ధ్వంసం చేయడం, తమిళ విద్యార్థులపై ABVP పిరికిపంద దాడి అత్యంత ఖండనీయం, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను” అని స్టాలిన్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ పోలీసులు, JNU భద్రతా సిబ్బంది విద్యార్థులపై జరిగిన హింసకు మూగ ప్రేక్షకులలుగా ఉండిపోయరని స్టాలిన్ ఆరోపించారు.

ఆదివారం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని అపవిత్రం చేయడం వెనుక వామపక్ష మద్దతు గల అనుబంధ సంస్థల విద్యార్థుల హస్తం ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యులు ఆరోపించారు.

అయితే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐఐటీ బాంబే విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ జరిగిన మార్చ్ తర్వాత కొంతమంది విద్యార్థులపై ABVP దాడి చేసిందని JNUSU ఆరోపించగా ఈ ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది.

JNUSU ఒక ప్రకటనలో, “ABVP మరోసారి విద్యార్థులపై దాడికి దిగింది…ఆత్మహత్య చేసుకున్న దర్శన్ సోలంకి తండ్రి పిలుపుకు సంఘీభావంగా క్యాండిల్‌లైట్ మార్చ్ చేసిన వెంటనే ఇది జరిగింది… కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం జరగకుండా చేయడానికి ABVP మరోసారి ఇలా చేసింది. ” అని తెలిపింది.


First Published:  21 Feb 2023 8:03 AM GMT
Next Story