Telugu Global
National

బీజేపీ ‘వాషింగ్ మిషన్ సర్వీస్’.. పరువు తీసేలా సెటైర్లు

అలాంటి వారంతా బీజేపీ వాషింగ్ మిషన్ సర్వీస్ తో హ్యాపీ కస్టమర్లుగా ఉన్నారని ఆప్, సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చింది.

బీజేపీ ‘వాషింగ్ మిషన్ సర్వీస్’.. పరువు తీసేలా సెటైర్లు
X

బీజేపీ ‘వాషింగ్ మిషన్ సర్వీస్’... సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ ఇది. అవినీతి మరకలంటించుకున్న ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరిన తర్వాత వారికి వాషింగ్ మిషన్ సర్వీస్ ని ఉచితంగా అందిస్తారని, అందులో వారిని బాగా ఉతికేసి పరిశుభ్రంగా మార్చేస్తారని, సచ్ఛీలురుగా వారు బయటకొచ్చేస్తారని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. మనీష్ సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఈ వాషింగ్ మిషన్ జోక్ తెగ వైరల్ అవుతోంది.

హ్యాపీ కస్టమర్లు..

బీజేపీ వాషింగ్ మిషన్ సర్వీస్ ద్వారా సంతోషకరమైన ఫలితాలు అందుకున్న కస్టమర్లు వీరేనంటూ ఓ లిస్ట్ కూడా బయటపెట్టింది ఆప్.

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి

కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప

వీరంతా బీజేపీ బయట ఉన్నప్పుడు వారిన దారికి తెచ్చుకోడానికి అవినీతి మరకలంటించారు. కేసుల పేరుతో భయపెట్టి తమ దారికి తెచ్చుకున్నారు. తమ పార్టీలో చేరిన తర్వాత పదవులిచ్చి సంతోష పెట్టారు. ఇలాంటి వారంతా బీజేపీ వాషింగ్ మిషన్ సర్వీస్ తో హ్యాపీ కస్టమర్లుగా ఉన్నారని ఆప్, సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చింది. బయట పార్టీల్లో ఉంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు బీజేపీకి లొంగిపోతే ఆ తర్వాత విచారణ సంస్థలు వారికి క్లీన్ చిట్ ఇస్తాయని, వారంతా వెంటనే బీజేపీలో చేరిపోతుంటారని వివరణ ఇచ్చింది.


తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. సిసోడియా ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు. కేసులు అడ్డుపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని టార్చర్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

First Published:  1 March 2023 6:17 AM GMT
Next Story