Telugu Global
National

ఆప్ ఎంపీపై స‌స్పెన్ష‌న్ వేటు

ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారని చైర్మన్ జగదీప్ ధన్‌క‌డ్‌ హెచ్చరించారు. అనంతరం సంజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు.

ఆప్ ఎంపీపై స‌స్పెన్ష‌న్ వేటు
X

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ‌ ఎంపీ సంజ‌య్ సింగ్‌పై వేటు ప‌డింది. స‌భ‌లో అనుచిత ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ఆయ‌న్ని వ‌ర్షాకాల స‌మావేశాల మొత్తానికి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ ప్ర‌క‌టించారు. పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం మ‌ణిపూర్ అంశంపై విప‌క్షాలు చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టాయి. ఉద‌యం స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌ర్వాత విప‌క్షాలు మ‌ణిపూర్ అంశంపై నిర‌స‌న‌లు తెలియ‌జేశాయి. దీనిపై గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా ప‌డింది.

విప‌క్షాల ఆందోళ‌న‌ల న‌డుమే..

ఆ త‌ర్వాత ప్రారంభ‌మైన స‌భా స‌మావేశంలోనూ తిరిగి అదే ప‌రిస్థితి కొన‌సాగింది. మణిపుర్ అంశంపై ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని చైర్మన్ హెచ్చరించినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారని చైర్మన్ జగదీప్ ధన్‌క‌డ్‌ హెచ్చరించారు. అనంతరం సంజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమే ఈ తీర్మానంపై మూజువాణి ఓటింగ్ చేపట్టిన చైర్మన్.. ఆప్ ఎంపీని ఈ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

లోక్‌స‌భ కూడా..

మ‌రోప‌క్క‌ లోకసభ లోనూ గందరగోళ పరిస్థితులే కన్పించాయి. విపక్షాల ఆందోళనలతో తొలుత సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవ్వగా.. ప్రతిపక్షాలు మళ్లీ నిరసన చేపట్టాయి. విప‌క్షాల స‌భ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేప‌థ్యంలో తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

First Published:  24 July 2023 9:21 AM GMT
Next Story