Telugu Global
National

రాహుల్ యాత్ర విజయవంతం కావాలంటూ రామజన్మభూమి ప్రధాన పూజారి లేఖ!

"మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ మిషన్ విజయవంతం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కలకాలం జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను" అని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్, రాహుల్ కు రాసిన‌ లేఖలో పేర్కొన్నారు.

రాహుల్ యాత్ర విజయవంతం కావాలంటూ రామజన్మభూమి ప్రధాన పూజారి లేఖ!
X

రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర' ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు, అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని ఆయన తన లేఖలో ఆకాంక్షించారు. దేశాన్ని ఏకం చేయాలనే రాహుల్ లక్ష్యానికి తాను మద్దతు తెలుపుతున్నానన్నారు.

"మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ మిషన్ విజయవంతం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కలకాలం జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను" అని తన లేఖలో పేర్కొన్నారు.

"మీరు ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల సంతోషం కోసం 'సర్వజన్ హితై సర్వజన్ సుఖే' అనే ఉదాత్తమైన లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను" అని సత్యేంద్ర దాస్ లేఖలో పేర్కొన్నారు.

కాగా సత్యేంద్ర దాస్, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గోవాలని చాలా కోరుకున్నార‌ని కానీ ఆయన ఆరోగ్య సహకరించకపోవడంతో లేఖ రాశార‌ని కాంగ్రెస్ పార్టీ అయోధ్య జిల్లా ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ అన్నారు.

మరోవైపు తొమ్మిది రోజుల విరామం తర్వాత రాహుల్ యాత్ర ఈ రోజు మళ్ళీ ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ రోజు రాత్రికి యాత్ర ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోకి ప్రవేశించనుంది. సెప్టంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 26 న శ్రీనగర్ లో ముగియనుంది.

First Published:  3 Jan 2023 10:18 AM GMT
Next Story