Telugu Global
National

క్షుద్ర శక్తులు సిద్ధిస్తాయని.. మాంత్రికుడిని చంపి రక్తం తాగిన శిష్యుడు

ఈ కాలంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలు నమ్ముతూ క్షుద్ర పూజలంటూ.. శక్తులంటూ.. అనాగరికంగా, మృగంలా ప్రవర్తించడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది.

క్షుద్ర శక్తులు సిద్ధిస్తాయని.. మాంత్రికుడిని చంపి రక్తం తాగిన శిష్యుడు
X

పాతాళభైరవి సినిమా చూశారా.. అందులో తోటరాముడు అన్ని ఆటంకాలు ఎదుర్కొని చివరికి పాతాళ భైరవి గుహలోని అమ్మవారి చెంతకు చేరతాడు.అప్పుడు అమ్మవారు తోటరాముడికి ఓ సలహా ఇస్తుంది. మాంత్రికుడు పూజకి సిద్ధం చేశాడు.. మంత్ర శక్తుల కోసం నిన్ను అమ్మవారికి బలివ్వబోతున్నాడు.. నువ్వే తెలివిగా ఆ మాంత్రికుడిని బలిస్తే నీకే ఆ మంత్ర శక్తులు సిద్ధిస్తాయి.. అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అవుతుంది. ఇప్పుడు ఇటువంటి ఘటనే చత్తీష్‌ గడ్ రాష్ట్రం ధమ్ తరీ జిల్లాలో జరిగింది.

తన గురువు, మాంత్రికుడు అయిన వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తుండగా అతడిని వధిస్తే క్షుద్ర శక్తులు సిద్ధిస్తాయని నమ్మిన శిష్యుడు అతడిని దారుణంగా చంపి అతడి రక్తం తాగాడు.

బసంత్ సాహు (50) అనే మంత్రగాడి దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య చావ్లా(25) క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నాడు. క్షుద్ర పూజలు చేసే సమయంలో మాంత్రికుడిని చంపి ఆ రక్తం తాగితే క్షుద్ర శక్తులు సిద్ధిస్తాయని మన్య భావించాడు. తన గురువు క్షుద్ర పూజల్లో నిమగ్నమై ఉండగా అతనిపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అతడి రక్తాన్ని తాగాడు.

అనంతరం మాంత్రికుడి మృతదేహానికి నిప్పు పెట్టాడు. నిర్మానుష్య ప్రదేశంలో కాలిన స్థితిలో మృతదేహం పడి ఉండడం గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలు నమ్ముతూ క్షుద్ర పూజలంటూ.. శక్తులంటూ.. అనాగరికంగా, మృగంలా ప్రవర్తించడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది.

First Published:  4 Feb 2023 8:38 AM GMT
Next Story