Telugu Global
National

బిడ్డ పెళ్లి ఉంది.. మా డబ్బు ఇచ్చేయండి - తుపాకీతో కాల్చుకుని దంపతుల ఆత్మహత్య

తొలుత తన భార్య మీనూను తుపాకీతో కాల్చేసి.. ఆ తర్వాత తాను కాల్చుకున్నాడు. తుపాకీ పేలిక శబ్దం రావడంతో కింది అంతస్థులోని వారు పైకి పరుగులు తీశారు.

బిడ్డ పెళ్లి ఉంది.. మా డబ్బు ఇచ్చేయండి - తుపాకీతో కాల్చుకుని దంపతుల ఆత్మహత్య
X

అప్పుగా డబ్బు తీసుకున్న వ్యక్తులు తిరిగి ఆ అప్పు చెల్లించకుండా వేధిస్తుండటంతో మధ్యప్రదేశ్‌లో ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. పన్నా నగరానికి చెందిన బట్టల వ్యాపారి సంజయ్‌ సేత్‌ ఆత్మహత్యకు ముందు ఒక వీడియో రికార్డు చేశాడు. కాగితం మీద సూసైడ్ నోట్ కూడా రాశాడు.

తొలుత తన భార్య మీనూను తుపాకీతో కాల్చేసి.. ఆ తర్వాత తాను కాల్చుకున్నాడు. తుపాకీ పేలిక శబ్దం రావడంతో కింది అంతస్థులోని వారు పైకి పరుగులు తీశారు. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మీనూ చనిపోయి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంజయ్ సేత్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే చనిపోయాడు.

ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోలో తన దగ్గర డబ్బులు తీసుకున్న వారు తిరిగి చెల్లించడం లేదని సంజయ్ బోరున విలపించాడు. ''నా పిల్లల భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరం ఉంది.. దయచేసి ఇవ్వండి'' అంటూ వేడుకున్నాడు. తన కుమార్తె పెళ్లి ఉందని.. అందుకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించాడు. ప్రస్తుతం తన కుమార్తె అకౌంట్‌లో 29 లక్షలు ఉన్నాయని చెప్పాడు. తన కూతురు ఆభరణాలు బ్యాంకు లాకర్‌లో ఉన్నాయని వివరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను, తన భార్య బతకలేం.. క్షమించండి పిల్లలు'' అంటూ సంజయ్‌ సేత్ కోరాడు.

తాను ఆరాధించే భాగేశ్వర్‌ ధామ్‌ పేరును సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ భాగేశ్వర్‌ ధామ్‌ భక్తుడిగానే పుడుతానంటూ రాశాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  30 Jan 2023 5:41 AM GMT
Next Story