Telugu Global
National

669 లాకప్ డెత్స్...పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన‌

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అందించిన డేటాను ఉటంకిస్తూ పోలీసు కస్టడీలో మరణాల వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

669 లాకప్ డెత్స్...పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన‌
X

ఏప్రిల్ 1, 2017 నుండి మార్చి 31, 2022 వరకు గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 669 పోలీసు కస్టడీలో మరణాలు సంభవించాయని హోం మంత్రిత్వ శాఖ (MHA) రాజ్యసభకు తెలిపింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అందించిన డేటాను ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

2021-2022లో పోలీసు కస్టడీలో మొత్తం 175 మరణాలు, 2020-2021లో 100, 2019-2021లో 112, 2018-2019లో 136, 2017-2018లో 146 కేసులు నమోదయ్యాయని రాయ్ చెప్పారు.

కాగా, 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో 201 కేసులకు గాను రూ.5,80,74,998 నష్ట పరిహారంతోపాటు ఒక కేసులో క్రమశిక్షణా చర్యలను ఎన్‌హెచ్‌ఆర్సీ సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. అయితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీస్, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర అంశాలని మంత్రి స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలను జారీ చేస్తుందని, మానవ హక్కుల పరిరక్షణ చట్టం (PHR) 1993ని కూడా రూపొందించిందని, మానవ హక్కుల ఉల్ల‍ంఘనలను పరిశీలించడానికి NHRC, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు.

"మానవ హక్కులు, ప్రత్యేకించి కస్టడీలో ఉన్న వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం పోలీసుల‌కు అవగాహన కల్పించేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎప్పటికప్పుడు వర్క్షాప్ లు, సెమినార్‌లను నిర్వహిస్తుంది" అని మంత్రి రాయ్ చెప్పారు.

First Published:  8 Feb 2023 4:06 PM GMT
Next Story