Telugu Global
National

బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రణాళికలు!

తెలంగాణలో టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డ బీజేపీ ఇప్పుడు బెంగాల్ పై దృష్టి సారించింది. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని గతంలో స్వయంగా ప్రధాని మోడీయే బహిరంగంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ...ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మళ్ళీ అవే మాటలు మొదలు పెట్టారు.

బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రణాళికలు!
X

తాము తప్ప మరే పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీ సహించలేకపోతోంది. ప్రజలు మెజార్టీ ఇచ్చి వేరే పార్టీలను గెలిపించినప్పటికీ ఆ ప్రభుత్వాలను ఎలా కూల్చేయాలన్న ఆలోచనలోనే మునిగితేలుతోంది బీజేపీ. ఇప్పటికే కర్నాటక, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అక్కడ‌ తాము అధికారంలోకొచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలను కూల్చేసే పని లో బిజీగా ఉంది. తెలంగాణలో టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డ బీజేపీ ఇప్పుడు బెంగాల్ పై దృష్టి సారించింది. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని గతంలో స్వయంగా ప్రధాని మోడీయే బహిరంగంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ...ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మళ్ళీ అవే మాటలు మొదలు పెట్టారు.

సాద్య‌మైనంత త్వ‌ర‌గా టిఎంసి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు మాట్లాడుతున్నారు. మొన్న బిజెపి రాష్ట్ర అద్య‌క్షుడు మ‌జుందార్‌, ఈ రోజు కేంద్ర మంత్రి నిశిత్ ప్ర‌మాణిక్‌,అంత‌కు ముందు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, సువేందు అధికారి వంటి బిజెపి నేత‌ల వ్యాఖ్య‌లు ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి.

ప‌శ్చిమ బెంగాల్ లో 40-45 మంది టిఎంసి ఎమ్మెల్యేలు బిజెపితో ట‌చ్ లో ఉన్నార‌ని కేంద్ర హోం శాఖ డిప్యూటీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ సోమ‌వారంనాడు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే బెంగాల్‌లో టిఎంసి పునాదులు చాలా బలహీనంగా మారాయ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో ఏం చేయాల‌నే విష‌య‌మై త‌మ పార్టీ ఆలోచిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

'ఖేలా హోబే'( ఆట జ‌రుగుతుంది).. రెండు పార్టీలు ఆడ‌తాయి. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట. 40 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నారు. త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అరెస్ట‌వుతారు అంటూ ఆ రాష్ట్ర బిజెపి అద్య‌క్షుడు సుకాంత్ మ‌జుంద‌ర్ వ్యాఖ్యానించిన రెండు రోజుల్లోనే కేంద్ర మంత్రి బిజెపి నేత ప్ర‌మాణిక్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. అలాగే సినీన‌టుడు. బిజెపి నేత మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కూడా ప‌లు సంద‌ర్భాల్లో టిఎంసి నేత‌లు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని వ్యాఖ్యానించిన విష‌యం కూడా తెలిసిందే.

కూచ్ బిహార్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి నిశిత్ మాట్లాడుతూ.. టిఎంసి పార్టీ పునాదులు బ‌హీనంగా మారాయని, ఎప్పుడైనా పేక‌మేడ‌లా కూలిపోతుంద‌ని అన్నారు. "మేము దీన్ని బాగా అర్థం చేసుకున్నాము బెంగాల్ ప్ర‌జ‌ల‌కూ ఇది బాగా అర్థం అయింది. 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలో ఆలోచిస్తాం." అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని, 2024 నాటికి ప్రభుత్వం కుప్ప‌కూలుతుంద‌ని విపక్ష నాయకుడు సువేందు అధికారి పేర్కొన్నారు.

మ‌రోవైపు తమ ఎమ్మెల్యేలు ఎవ‌రూ అమ్మకానికి సిద్ధంగా లేరని బిజెపి వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టింది టిఎంసి.

First Published:  5 Dec 2022 10:18 AM GMT
Next Story