Telugu Global
National

ముంచెత్తిన వరద.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

మరోపక్క నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్డమ్‌ ఫుట్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. అటు పశ్చిమ బెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి చాలాచోట్ల కొట్టుకుపోయింది.

ముంచెత్తిన వరద.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
X

సిక్కింలో ఆకస్మిక వరదల్లో చిక్కుకొని 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగింది. అదే సమయంలో చుంగ్‌ థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆకస్మిక వరద ముంచుకొచ్చింది. దీంతో దిగువ ప్రాంతంలో నీటిమట్టం ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలో చిక్కుకున్న ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ చెక్‌పోస్టులు నీట మునిగాయి. సింగ్డమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతైనట్టు ఈస్ట్రన్‌ కమాండ్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 41 వాహనాలు నీట మునిగినట్టు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్టు వెల్లడించింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేదు. దీంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్‌ స్థాయి అధికారులు సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.

మరోపక్క నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్డమ్‌ ఫుట్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. అటు పశ్చిమ బెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి చాలాచోట్ల కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు నీటమునిగాయి. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ స్పందించారు. తక్షణ సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

First Published:  4 Oct 2023 5:56 AM GMT
Next Story