Telugu Global
National

పాడుబడిన బావులతో తమిళనాడు ప్రయోగం అద్భుతం

తమిళనాడులోని విరుదు నగర్ జిల్లాలో 'స్ట్రింగ్ ఆఫ్ వెల్స్' అనే పేరుతో స్థానిక అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని 163 పాడుబడిన బావులకు కొత్త రూపాలనిచ్చారు.

పాడుబడిన బావులతో తమిళనాడు ప్రయోగం అద్భుతం
X

పూర్వం మంచినీటికోసం ఉపయోగించే బావులు గ్రామాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల కనబడుతుంటాయి. పట్టణాల్లో కూడా బావులు ఉంటాయి కానీ పాడుబడిపోయిన స్థితిలో వాటిని చెత్తతో నింపేసి ఆ తర్వాత శాశ్వతంగా తొలగించేస్తూ ఉంటారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇలా బావుల్ని తొలగించేందుకు ఇష్టపడలేదు. పైగా వాటికి మరమ్మతులు చేసి సుందరంగా ముస్తాబు చేసింది. అందమైన ఆకారాల్లో వాటిని ఈ తరం కూడా ఇష్టపడేలా తయారు చేసింది.

తమిళనాడులోని విరుదు నగర్ జిల్లాలో 'స్ట్రింగ్ ఆఫ్ వెల్స్' అనే పేరుతో స్థానిక అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని 163 పాడుబడిన బావులకు కొత్త రూపాలనిచ్చారు. పుచ్చకాయ, పూలబుట్ట, రైల్వే కంపార్ట్ మెంట్.. ఇలా రకరకాల ఆకారాల్లో వాటిని తయారు చేశారు. ఈ కొత్త బావులు, ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సామాజిక ప్రయోజనం కూడా..

కేవలం కంటికింపుగా వాటిని సిద్ధం చేయడం కాదు, వాటి ద్వారా భవిష్యత్ తరాలకు మంచి మెసేజ్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల వర్షపు నీరు బావిలోకి వెళ్లే విధంగా పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాలు పోకుండా కేవలం నీరు మాత్రమే వెళ్లే ఏర్పాటు చేశారు. ఒకరకంగా వాటిని ఇంకుడు గుంతల్లా వాడుతున్నారనమాట. ఆ బావుల నుంచి నేరుగా ఎవరూ నీటిని తీసుకుని వాడరు, అయితే వాటి వల్ల చుట్టుపక్కల నీటి మట్టం పెరిగే అవకాశం కలుగుతుంది. వర్షపు నీరు డ్రైనేజీలలో కలవకుండా బావుల్లోకి వెళ్తుంది. వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది చుట్టూ పార్క్ ల వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.


First Published:  22 Sep 2023 7:42 AM GMT
Next Story