Telugu Global
National

మణిపూర్‌లో మిలిటెంట్ గ్రూపుల మధ్య కాల్పులు.. 13 మంది మృతి

ఘటన జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే భద్రతా బలగాలు ఉండటంతో ఈ సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

మణిపూర్‌లో మిలిటెంట్ గ్రూపుల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
X

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మిలిటెంట్ల గ్రూపు మయన్మార్ వెళ్తుండగా ఆ ప్రాంతంలో ఆధిపత్యం ఉన్న మరో మిలిటెంట్ గ్రూప్ వారిపై దాడి చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే భద్రతా బలగాలు ఉండటంతో ఈ సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలు కనిపించలేదని, అలాగే ఈ చనిపోయినవాళ్లు స్థానికులు కాదని ప్రాథ‌మిక సమాచారం.

మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గొడవల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడికిన మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఏడు నెలల క్రితం విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఎత్తివేసింది. డిసెంబరు 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది అయితే, సరిహద్దు ప్రాంతంలోని 9 జిల్లాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది. కుకీ, మైటీల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను మినహాయించి ఇంటర్నెట్ పునరుద్దరణ ఉంటుందని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడడం అలాగే సుదీర్ఘ కాలంగా ఇంటర్నెట్ లేక సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

First Published:  4 Dec 2023 3:44 PM GMT
Next Story