Telugu Global
National

బాలుడిపై గ్యాంగ్ రేప్.. రాడ్డుతో ప్రైవేట్ పార్ట్స్ ని గాయపరిచిన వైనం

బాలుడిపై అత్యాచారం జరపడమే కాకుండా అతడి ప్రైవేట్ పార్ట్స్ లోకి రాడ్డును చొప్పించి గాయపరచడంతో అతడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాలుడిపై గ్యాంగ్ రేప్.. రాడ్డుతో ప్రైవేట్ పార్ట్స్ ని గాయపరిచిన వైనం
X

దేశ రాజధాని ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా భద్రత కరువైంది. పదేళ్ళ కిందట ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను రాడ్లతో గాయపరచడంతో ఆమె సింగపూర్ లో చికిత్స పొందుతూ మృతిచెందింది. తాజాగా అదే ఢిల్లీలో 12 బాలుడిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలుడికి తెలిసినవారే కామంతో కళ్లు మూసుకుపోయి ఈ దారుణానికి ఒడిగట్టారు.

బాలుడిపై అత్యాచారం జరపడమే కాకుండా అతడి ప్రైవేట్ పార్ట్స్ లోకి రాడ్డును చొప్పించి గాయపరచడంతో అతడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 18న 12 ఏళ్ల బాలుడిపై అతడి బంధువు సహా ముగ్గురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత రాడ్డును అతడి ప్రైవేట్ పార్ట్స్ లోకి చొప్పించి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా కర్రలతో కొట్టారు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే జరిగిన దారుణంపై బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వైద్యులే కల్పించుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాలుడి తల్లిదండ్రులను క‌లిసినా వారు నిందితుల వివరాలు చెప్పేందుకు నిరాకరించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు.

పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు మైనర్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించి.. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఢిల్లీలో బాలుడిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జరిగిన దారుణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దారుణ సంఘటనపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆమె కోరారు.

First Published:  26 Sep 2022 3:34 AM GMT
Next Story