Telugu Global
NEWS

అందరికీ సంక్రాంతే కావాలి.. ముగ్గుల పండక్కి సినిమాల క్యూ

పండక్కి నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్లను కూడా ఫిక్స్ చేశారు. ఇన్ని సినిమాల విడుదల మధ్య చివరికి థియేటర్లు దొరక్క ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

అందరికీ సంక్రాంతే కావాలి.. ముగ్గుల పండక్కి సినిమాల క్యూ
X

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. కుటుంబంలో ఎవరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా, విదేశాల్లో ఉన్నా ముగ్గుల‌ పండుగకు ఇంటికి చేరుతుంటారు. అందుకే అన్ని పండుగల కంటే ఆ పండక్కి ఊర్లలో సందడి ఎక్కువ. ఈ కారణం వల్లే సంక్రాంతి సమయంలో తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు, హీరోలు కూడా ఆసక్తి చూపుతుంటారు. కలెక్షన్లు కూడా భారీగా వస్తుండటంతో పోటాపోటీగా పండక్కు సినిమాలు విడుదలవుతుంటాయి.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతికి పోటాపోటీగా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఎంత పెద్ద పండుగ అయినా అగ్ర హీరోలు నటించిన రెండు లేదా మూడు సినిమాల విడుదలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకుమించి సినిమాలు విడుదల అయితే థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి రెండు లేదా మూడు కాదు చాలా సినిమాలు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

పండక్కి నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్లను కూడా ఫిక్స్ చేశారు. ఇన్ని సినిమాల విడుదల మధ్య చివరికి థియేటర్లు దొరక్క ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా అందరికంటే ముందే సంక్రాంతి బెర్త్ ఫిక్స్ చేసుకుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక అదే రోజు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి విడుదల కానుంది. 13వ తేదీన వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్న సైంధవ్ సినిమా రిలీజ్ కానుంది. ఇదే డేట్ లో రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఈగల్ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కాకుండా డేట్ ఫిక్స్ చేసుకోకుండా సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి.

తేజ సజ్జ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్ జనవరి 12వ తేదీన విడుదల చేస్తామని కొన్ని నెలల కిందట మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు హనుమాన్ మూవీని ఆ డేట్ లో కాకుండా మరో డేట్ లో పండుగ సమయంలోనే మరో డేట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా కూడా ముగ్గుల పండక్కే వస్తోంది. దీనిపై ఇటీవలే దిల్ రాజు కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక నాగార్జున హీరోగా నటిస్తున్న కొత్త సినిమా `నా సామిరంగా`.. కొద్ది రోజుల కిందటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. సంక్రాంతే లక్ష్యంగా తమ సినిమాను పూర్తి చేస్తున్నట్లు నాగార్జున తెలిపారు. రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ను ముందుగా డిసెంబర్లో విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి వాయిదా వేయాలన్న యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా అందరూ తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని చూస్తున్నారు. పండక్కి ఇద్దరు అగ్ర హీరోలు, మరో రెండు లేదా మూడు చిన్న సినిమాల విడుదలకు అవకాశం ఉంటుంది కానీ, ఒకేసారి ఇంతమంది అగ్ర హీరోల సినిమాలు విడుదల చేసేందుకు అవకాశం లేదు. అన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అందుకే కొంతమంది చివర్లో వెనక్కి తగ్గాల్సి వస్తుంది. మరి ఇన్ని సినిమాల్లో ఆఖరికి ఎవరు వెనక్కి తగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయా చిత్రాల నిర్మాతలు సంక్రాంతికి తమ సినిమాలు కచ్చితంగా విడుదల అవుతాయంటూ ప్రమోషన్లు చేస్తున్నారు.

First Published:  23 Oct 2023 7:08 AM GMT
Next Story