Telugu Global
NEWS

పొంగులేటి, జూపల్లి లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్

పార్టీలో ఉంటూనే పార్టీకి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు.

పొంగులేటి, జూపల్లి లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్
X

కొంతకాలంగా భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉంటున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావులపై ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వేటు వేశారు. నిన్న కొత్తగూడెంలో శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఇద్దరు నాయకులు కేసీఆర్ పై, బీఆరెస్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిన్న సభలో పొంగులేటి మాట్లాడుతూ, కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడో సారి సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు.

జూపల్లి కూడా కేసిఆర్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పేరుతో దేశానికి చెత్త పాలన ఇస్తారా? అని ప్రశ్నించారు. సాగునీటి టెండర్లలో మాయాజాలం ప్రదర్శిస్తూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు.

పార్టీలో ఉంటూనే పార్టీకి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు.

First Published:  10 April 2023 5:14 AM GMT
Next Story