Telugu Global
NEWS

జపాన్‌ భూకంపం.. జూ.ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం..!

జపాన్ భూకంపంపై ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్‌ నుంచి ఇవాళే తిరిగి ఇంటికి వచ్చానని.. భూకంపం సమాచారం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్‌లో తెలిపారు.

జపాన్‌ భూకంపం.. జూ.ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం..!
X

జపాన్‌లో సోమవారం సంభవించిన వరుస భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని జపాన్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం జారీ చేసిన అన్ని రకాల సునామీ హెచ్చరికలను జపాన్‌ వాతావరణ సంస్థ ఎత్తివేసింది.

హోన్షు ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌ను సోమవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపం వణికించింది. తరువాత వరుసగా 100 వరకు భూప్రకంపనలు వచ్చాయి. సముద్రంలోనూ 1.2 మీటర్‌ - దాదాపు 4 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. దీంతో తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూప్రకంపనల కారణంగా జపాన్‌ వ్యాప్తంగా రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. 45 వేలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.


జపాన్ భూకంపంపై ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్‌ నుంచి ఇవాళే తిరిగి ఇంటికి వచ్చానని.. భూకంపం సమాచారం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్‌లో తెలిపారు. గత వారం మొత్తం జపాన్‌లోనే ఉన్నానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. భూకంప బాధితులకు తనకు సంఘీభావం ప్రకటించారు. జపాన్ ప్రజలు ధైర్యంగా ఉండాలని తన ట్వీట్‌లో చెప్పారు.

First Published:  2 Jan 2024 5:41 AM GMT
Next Story