Telugu Global
International

ఐక్యరాజ్య సమితిలో చైనాకుమద్దతుగా ఇండియా...

ముస్లింలపై చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, అణిచివేత పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఓడించడంలో భారత్ తన వంతు పాత్ర పోషించింది. ఓటింగ్ ను బహిష్కరించి పరోక్షంగా చైనాకు సహకరించింది.

ఐక్యరాజ్య సమితిలో చైనాకుమద్దతుగా ఇండియా...
X

ఉప్పు నిప్పుగా ఉండే భారత్ , చైనాలు ఓ విషయంలో ఒక్కటయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం కోసం జరిగిన ఓటింగ్ కు దూరంగా ఉండి భారత్ పరోక్షంగా చైనాకు సహకరించింది.

చైనాకు భారత్ ఇలా సహకరించిన అంత గొప్ప విషయం ఏంట‌నుకుంటున్నారా? ముస్లింలపై చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, అణిచివేత పై తీర్మానాన్ని ఓడించడంలో భారత్ తన వంతు పాత్ర పోషించింది.

చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ ఉయ్ఘర్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో ఉయ్ఘర్, కజఖ్లు, ఇతర ముస్లిం జాతి మైనారిటీలపై చైనా పాల్పడుతున్న అణిచివేత, మసీదులను కూల్చి వేయడం, బ్రెయిన్ వాష్ చేయడం, హక్కుల ఉల్లంఘన తదితర విషయాలపై గురువారంనాడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో ప్రవేశ పెట్టిన తీర్మానంపై మొత్తం 47 దేశాలకు గాను కెనడా, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, UK, USA తదితర 17 దేశాలు అనుకూలంగా ఓటేయగా, చైనా, పాకిస్థాన్, నేపాల్ సహా 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్‌తో సహా 11 దేశాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీంతో చైనాపై తీర్మానం వీగిపోయింది.

కౌన్సిల్‌లో జరిగిన పరిణామాలపై మానవ హక్కుల కార్యకర్తలు, సంస్థలు తీవ్రంగా స్పందించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామార్డ్ మాట్లాడుతూ... "ఈ తీర్మానం ఓటమి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడేవారిని రక్షిస్తుంది.ఇది భయంకరమైన ఫలితం. " అన్నారు.

First Published:  7 Oct 2022 3:04 AM GMT
Next Story