Telugu Global
International

పాక్‌ ప్రధానిగా షహబాజ్‌! - పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌– నవాజ్‌ అనూహ్య నిర్ణయం

పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌–ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తో చర్చలు జరిపింది.

పాక్‌ ప్రధానిగా షహబాజ్‌! - పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌– నవాజ్‌ అనూహ్య నిర్ణయం
X

పాకిస్తాన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగోసారి పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఆయన స్థానంలో షహబాజ్‌ షరీఫ్‌ (72) ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌– నవాజ్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. షహబాజ్‌ షరీఫ్‌ (72)ను తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. దీంతో షహబాజ్‌ మరోసారి పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ఎక్స్‌ (ట్విటర్‌)లో వివరాలు వెల్లడించారు. తమ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ని ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ (50)ను పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌–ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తో చర్చలు జరిపింది. తొలుత బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని వార్తలు వచ్చినా.. ఆయన ప్రధాని పదవి రేసు నుంచి వైదొలిగినట్టు తాజాగా ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ భాగం కాకుండానే ’పీఎంఎల్‌–ఎన్‌’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో నవాజ్‌ షరీఫ్‌ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.

265 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్‌–ఎన్‌ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. ఇక పీఎంఎల్‌–ఎన్‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్‌ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  14 Feb 2024 3:31 AM GMT
Next Story