Telugu Global
International

ముషారఫ్‌కు మరణానంతర మరణశిక్ష

ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. అయితే, శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు.

ముషారఫ్‌కు మరణానంతర మరణశిక్ష
X

పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్షను ఖరారు చేసింది.

ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. అయితే, శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు.

సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజిక్కించుకున్న ముషారఫ్, దాదాపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఆ సమయంలో రెండుసార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ ఆయనపై 2008లో అధికారానికి దూరమైన తర్వాత దేశద్రోహ కేసు దాఖలు అయింది.

సుదీర్ఘ కాలం పాటు దీనిపై కోర్టులో విచారణ జరిగింది. 2019లో స్పెషల్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. అయితే ముషారఫ్ దుబాయ్ నుంచే దీనిపై న్యాయ పోరాటం చేశారు. తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు.

లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా.. ఈసారి పిటిషన్ దారులు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముషారఫ్ వారసులు ఎవరూ కూడా ఎన్నిసార్లు తెలియచేసినా పట్టించుకోలేదని, నోటీసులను స్వీకరించలేదని, . ఈ కేసులో పోరాడేందుకు వారు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ముషారఫ్ వారసులకు పాక్ సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది, పాకిస్థాన్ తో పాటు విదేశాల్లోని ప్రధాన పత్రికలలో ఈ నోటీసులను ప్రచురించేలా చేసింది. ఇంత చేసినా వారు కోర్టుకు హాజరుకాకపోవడంతో తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించింది. ముషారఫ్ కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ క్వాజీ ఫయేజ్ ఇసా పేర్కొన్నారు. మరణానంతరం ఆయనకు మరణ శిక్షను ఖరారు చేశారు.

First Published:  11 Jan 2024 8:24 AM GMT
Next Story