Telugu Global
International

ఆస్ట్రేలియాలో 'మిస్టరీ వస్తువు'.. చంద్రయాన్-3 శకలాలంటూ మీడియాలో ప్రచారం!

సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ ప్రచారం జరుగుతోంది.

ఆస్ట్రేలియాలో మిస్టరీ వస్తువు.. చంద్రయాన్-3 శకలాలంటూ మీడియాలో ప్రచారం!
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాకెట్ లాంచింగ్ విజయవంతం కావడంతో.. ఇక ఇప్పుడు అందరి ఆసక్తి దాని ప్రయాణంపైనే ఉన్నది. మరో నెల రోజుల్లో చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో చంద్రయాన్-3 మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది. ఆస్ట్రేలియా బీచ్‌లో కనపడిన ఒక మిస్టరీ వస్తువే ఇందుకు కారణం. సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ ప్రచారం జరుగుతోంది.

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3ని నింగిలోకి ఎల్వీఎం రాకెట్ మోసుకెళ్లింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనపడ్డాయి. ఈ క్రమంలో ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన శకలాలు చంద్రయాన్ రాకెట్‌కు చెందినవే అనే ప్రచారం జరుగుతోంది. ఈ శకలానికి చెందిన ఫొటోలను ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

ఈ శకలం విదేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని ఆస్ట్రేలియా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనుమానం ఉన్న దేశాలకు కూడా ఆస్ట్రేలియా సమాచారం అందించింది. బీచ్‌లో పడి ఉన్న వస్తువు దగ్గరకు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేసింది. అంతే కాకుండా.. దాన్ని తాకొద్దని, కదిలించ వద్దని ప్రజలను హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కొంత మంది ఒకడుకు ముందుకు వేసి.. ఈ శకలాన్ని ఇస్రో ప్రయోగించిన ఎల్వీఎం రాకెట్‌తో పోలుస్తున్నారు. ఇది ఇండియాకు చెందినదే అని వాదిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మిస్టరీ వీడుతుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు తెలియజేస్తున్నారు.


First Published:  18 July 2023 12:51 AM GMT
Next Story