Telugu Global
International

క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌కు రాణి ఎలా అయ్యారు? చార్లెస్‌ను రాజుగా ఎలా నియమించబోతున్నారు?

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు.

Queen Elizabeth II
X

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. గురువారం ఉదయమే (బ్రిటన్ కాలమానం ప్రకారం) క్విన్ ఎలిజబెత్ ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు.. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ నుంచి క్వీన్ ఎలిజబెత్‌కు ఆరోగ్య సమస్యలు తెలెత్తడం, కనీసం నడవడానికి కూడా శరీరం సహకరించకపోవడంతో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అధికారిక నివాసం అయిన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. కాగా, గురువారం క్వీన్ ఆరోగ్యం పూర్తిగి విషమించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతే కాకుండా రాణి ఆరోగ్యం బాగా లేదని బ్రిటన్ ప్రజలకు 'బీబీసీ' ప్రాథమిక సమాచారం ఇచ్చింది.

బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్.. మంగళవారమే ఆమెను స్కాట్లాండ్‌లో కలిశారు. బ్రిటన్‌కు ట్రస్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్లు రాయల్ ఫ్యామిలీ నుంచి ప్రకటన కూడా వెలువడింది. కానీ ఇంతలోనే ఎలిజబెత్ ఆరోగ్యం క్షీణించడం, ఆమె మరణించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. క్వీన్ ఎలిజబెత్‌తో లిజ్ ట్రస్ తీసుకున్న ఫొటోనే ఇప్పటి వరకు ఆమె బతికుండగా తీసుకున్న ఆఖరి ఫొటో కావడం గమనార్హం. క్వీన్ ఆరోగ్యం క్షిణించినట్లు వైద్యులు సమాచారం అందించడంతో.. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న బ్రిటన్ రాజకుటుంబ సభ్యులు అందరూ స్కాట్లాండ్ చేరుకున్నారు. ఈ విషయం బ్రిటన్ పౌరుల్లో ఆందోళన కలిగించింది.

క్విన్ మరణ వార్తను అధికారికంగా ప్రకటించక ముందే ఓ గల్ఫ్ టీవీ ఛానల్.. రాణి చనిపోయినట్లు ముందుగానే ప్రసారం చేసింది. కానీ ఎవరూ ఆ వార్తను నమ్మలేదు. అయితే బ్రిటన్ టైం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ బీబీసీ రాణి చనిపోయిన వార్తను ప్రసారం చేసింది.

ఎలిజబెత్ రాణి ఎలా అయ్యారు?

ప్రిన్సెస్ ఎలిజబెత్ ఆఫ్ యార్క్‌గా ఆమె 1926 ఏప్రిల్ 21న కింగ్ జార్జ్ 6కి జన్మించింది. ఆయన మరణం తర్వాత 1950లో ఆమెకు బ్రిటన్‌ రాణిగా పట్టాభిషేకం జరిగింది. ఒక రాజ్యానికి రాజు కొడుకు రాజు అవుతారు. కానీ బ్రిటన్‌కు ఆమె రాణి ఎలా అయ్యారని అందరినీ ఓ అనుమానం ఉంటుంది. కింగ్ జార్జ్ 5 కూతురుగా ఆమెకు బ్రిటన్ రాణిగా పట్టాభిషేకం చేశారు. వాస్తవానికి కింగ్ జార్జ్ 5 సోదరుడు తర్వాత రాజు కావాలి. కానీ ఆయన పెళ్లి చేసుకోకపోవడం, రాచరికంపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ కిరీటం ఎలిజబెత్‌కు దక్కింది. చిన్న వయసులోనే బ్రిటన్‌కు రాణి అయిన ఆమె.. అప్పటికే 3 ఏళ్ల చార్లెస్‌కు తల్లి. దీంతో చార్లెస్ మూడేళ్లకే రాకుమారుడు (ప్రిన్స్) హోదా దక్కించుకున్నారు.

ఆధునిక ప్రపంచంలో అత్యధిక కాలం రాణిగా ఉన్న వ్యక్తిగా క్వీన్ ఎలిజబెత్ 2 (70 ఏళ్లు) రికార్డు సృష్టించింది. అదే సమయంలో రాకుమారుడిగా ఉన్న వ్యక్తిగా చార్లెస్ (70), రాణి భర్తగా ప్రిన్స్ ఫిలిప్ (99) రికార్డు సృష్టించారు. క్విన్ ఎలిజబెత్ 2 భర్త ఫిలిప్ గత ఏడాదే చనిపోయారు. ఆయన అల్లుడు కావడంతో జీవితాంతం రాణి భర్తగానే మిగిలిపోయారు.

నెక్ట్స్ బ్రిటన్‌ రాజు చార్లెస్ ఎలా అవుతారు?

రాజులు, రాజ్యాలు అన్నీ పోయినా.. ఇప్పటికీ కొన్ని ప్రజాస్వామిక దేశాల్లో రాచరికం కొనసాగుతోంది. బ్రిటన్ వంటి ప్రజాస్వామిక దేశంలో కూడా... రాచరికాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. మన దేశంలో రాష్ట్రపతి ఎలాగో.. బ్రిటన్‌లో రాజుల పరిపాలన అలాగే ఉంటుంది. కేవలం ఓ ముద్రవేయడానికి మాత్రమే వాళ్లను ఉపయోగిస్తారు. అంతే తప్ప వారికి పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. అయితే గత 70 ఏళ్లుగా బ్రిటన్‌కు రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 మరణించడంతో తర్వాత ఆ పీఠాన్ని అధిరోహించేది ఎవరని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎలిజబెత్ 2005లోనే దీనిపై ఓనిర్ణయానికి వచ్చారని.. 2018లో పూర్తి స్పష్టత ఇచ్చారని బ్రిటన్ అధికారిక ఛానల్ బీబీసీ వివరించింది.

క్వీన్ ఎలిజబెత్-2 రాణిగా పట్టాభిషేకం అయినప్పుడు ఆమె పెద్ద కొడుకు చార్లెస్‌కు 3 ఏళ్ల వయసు ఉండేది. ఆనాడే అతను ప్రిన్స్‌గా గుర్తించబడ్డాడు. పెద్దయ్యాక డయానాను పెళ్లి చేసుకోవడంతో ఆమె 1981లో ప్రిన్సెస్ అయ్యింది. కానీ ఆ తర్వాత కాలంలో చార్లెస్, డయానాల మధ్య విభేదాలు రావడంతో 1992లో విడాకులు తీసుకున్నారు. 1997లో డయానా పారీస్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. 2005లో కమిలా పార్కర్‌ను చార్లెస్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు అప్పటికి ప్రిన్స్ హోదా దక్కలేదు. కానీ చార్లెస్-డయానాలకు పుట్టిన విలియం, హారీ రాకుమారులుగా గుర్తింపబడ్డారు.

రాజకుటుంబంలో పుట్టిన వారసుడిగా చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్‌కు రాజు అయ్యే పూర్తి అర్హతలు ఉన్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు ఎలిజబెత్-2 ఓ కుటుంబ సమావేశంలో చార్లెస్‌ను తన వారసుడిగా ప్రకటించింది. అంతే కాకుండా ఇటీవల బ్రిటన్‌లో రాజకుటుంబంలో నుంచి క్వీన్ పాల్గొనాల్సిన ప్రతీ కార్యక్రమానికి చార్లెస్‌ను పంపించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రాణి బదులు చార్లెస్ అధికారికంగా పాల్గొన్నారు. 2018లోనే ఎలిజబెత్ 2 తన పెద్ద కొడుకు చార్లెస్‌ను తన వారసుడిగా పేర్కొంటూ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ రికార్డులు కూడా రాసినట్లు బీబీసీ వెల్లడించింది.

అయితే చార్లెస్ తన పేరుతోనే బ్రిటన్ రాజుగా ఉంటారా? లేదంటే తన పూర్వికుల పేరును తీసుకొని పరిపాలన సాగిస్తారా అనేది త్వరలో తెలియనున్నది. ఇక చార్లెస్ రెండో భార్య కామిల్లా రాణిగా పట్టాభిషేకం అవుతారా అనేది మాత్రం అనుమానంగా ఉన్నది. డయానా మరణం తర్వాత చార్లెస్.. కమిల్లాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రాజవంశంలో ఆమెకు చోటు కూడా కల్పించలేదు. దీంతో ఆమెను రాణిగా పట్టాభిషేకం చేయడం అనేది కుటుంబ సభ్యుల అంగీకారంపైనే ఆధారపడి ఉంటుంది.

చార్లెస్ తర్వాత ఎవరు?

కింగ్ చార్లెస్ చనిపోయిన తర్వాత బ్రిటన్‌కు రాజుగా ఎవరుంటారు అనే చర్చ కూడా జరుగుతున్నది. చార్లెస్-డయానాల తొలి సంతానం విలియం (40) తర్వాత లిస్టులో ఉన్నారు. ఆయన తర్వాత విలియం కొడుకు ప్రిన్స్ జార్జ్, కూతురు ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్సెస్ లూయిస్ వరుసలా ఉంటారు. వాస్తవానికి విలియం తర్వాత తమ్ముడు హారీ లిస్టులో ఉండాల్సింది. కానీ ఆయన కొన్నేళ్ళ కింద సినీ నటి మేఘన్‌ను పెళ్లి చేసుకోవడమే కాకుండా, రాచరిక కట్టుబాట్లను, వారసత్వాన్ని వదిలేస్తున్నట్లు ప్రకటించి అమెరికాకు వెళ్లిపోయాడు. అయినా సరే ప్రిన్స్ విలియం కుటుంబ తర్వాత హ్యారీ కొడుకు కూతుర్లే బ్రిటన్ సింహాసనపు వారసులుగా ఉండనున్నారు.

ఏనాడూ రాజ్యాన్ని పాలించని రాణి..

బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఎంతో మంది రాజులు, రాణుల పరిపాలించారు. కానీ ఆ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యానికి రాణిగా అభిషేకించబడిన ఎలిజబెత్-2 మాత్రం ఏనాడూ ఒక రాజ్యాన్ని పరిపాలించలేదు. ఆమె కేవలం అధికారిక రాణిగానే మిగిలిపోయారు. తన తండ్రి కింగ్ జార్జ్ తోనే రాజ్యాలు అన్నీ అస్తమించిపోయారు. తర్వాత కామన్వెల్త్ దేశాలకు సుప్రీంగా మాత్రమే ఉన్నారు. బ్రిటన్ కూడా ఆనాటి రాజరికపు గొప్పదనాన్ని పోగొట్టుకోవద్దనే.. ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తూనే... బ్రిటన్ రాజరికాన్ని నామమాత్ర విధులకు పరిమితం చేసింది.

కొత్త రాజు పట్టాభిషేకం ఎలా?

క్వీన్ మరణించడంతో ఆమె వారసుడైన చార్లెస్ ఇక బ్రిటన్‌కు రాజుగా ప్రమాణం చేయనున్నారు. ఎలిజబెత్-2 తన తండ్రి మరణించిన వెంటనే రాణిగా మారినా.. ఆ తర్వాత 16 నెలలకు పట్టాభిషిక్తురాలు అయ్యారు. ఇప్పుడు కూడా రాణి మరణించడంతో 24 గంటల లోపు చార్లెస్‌ను రాజుగా ప్రకటించాలి. ఆయన పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త రాజును అంగీకరిస్తున్నట్లు, ఆయనకు విధేయత ప్రకటిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రైవీ కౌన్సిల్ ఎదుట కొత్త రాజు ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశమంతా ఆ రోజు సంబరాలు చేస్తారు. అంతే కాకుండా బ్రిటన్‌లో కొత్త రాజు పాలన మొదలైనట్లు దేశంలో మూలమూలలా బహిరంగ ప్రకటన చేస్తారు. ఇవన్నీ 1689లో బ్రిటన్ రాజరికం రూపొందించిన ప్రమాణ చట్టం మేరకే జరుగుతాయి.

First Published:  9 Sep 2022 11:09 AM GMT
Next Story